India -Afghanistan: పాక్ కు బిగ్ షాక్.. తాలిబన్లతో భారత్ చర్చలు!

తాలిబన్‌ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీతో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తాలిబన్‌ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. 2025 జనవరిలో విక్రమ్ మిస్రీ.. ముత్తాఖీని దుబాయ్‌లో కలిశారు.

New Update
India Afghanistan

తాలిబన్‌ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీతో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తాలిబన్‌ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం విశేషం.  ఈ సంభాషణలో భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ స్నేహం, అభివృద్ధి సహకారం వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు.  పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జై శంకర్‌ స్వాగతించారు. ఈ మేరకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 2021 ఆగస్టులో తాలిబన్లు కాబూల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన తొలి రాజకీయ సంబంధం ఇదే. కాగా భారత్ ఇంకా అధికారికంగా తాలిబన్ పాలనను గుర్తించకపోవడం గమనించదగ్గ విషయం. 2025 జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ముత్తాఖీని దుబాయ్‌లో కలిశారు.

కాందహార్ విమానం హైజాక్

 "ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవీ అమీర్ ఖాన్ ముత్తాకీతో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆఫ్ఘన్ ప్రజలతో మా సాంప్రదాయ స్నేహాన్ని, అభివృద్ధికి మా నిబద్ధతను పునరుద్ఘాటించాము. సహకారాన్ని మరింత పెంపొందించే చర్యలను చర్చించారు." అని జైశంకర్ ట్వీట్ చేశారు. కాగా  గతంలో 1999-2000 సంవత్సరంలో కాందహార్ విమానం హైజాక్ సంఘటన సమయంలో అప్పటి భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తాలిబాన్ విదేశాంగ మంత్రి వకీల్ అహ్మద్ ముత్తవాకిల్‌తో చర్చలు జరిపారు.  

పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడానికి ఇది మంచి అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.  ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో తరచుగా కాల్పులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా జరిగాయి. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో ఇద్దరి మధ్య చాలా తగాదాలు ఉన్నాయి. 

జైశంకర్, తాలిబన్ విదేశాంగ మంత్రి మధ్య ప్రత్యక్ష చర్చలు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను బలోపేతం చేస్తాయి.

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఒంటరి చేస్తుంది. ఇది పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలను బలహీనపరుస్తుంది.

పహల్గామ్ దాడిని తాలిబన్లు ఖండించిన తీరు, జైశంకర్ కృతజ్ఞత వ్యక్తం చేసిన తీరు పాకిస్తాన్‌ను చికాకుపెడుతుంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను తనతో పాటు తీసుకెళ్తోందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ సంబంధాలు మెరుగుపడటం వల్ల పాకిస్తాన్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ముస్లిం దేశమే. 

Advertisment
Advertisment
తాజా కథనాలు