/rtv/media/media_files/2025/10/07/chirag-paswan-2025-10-07-15-29-43.jpg)
బిహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లో 'తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని' అనడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా బిహార్లో అధికార కూటమి అయిన బీజేపీ-జేడీయూ మధ్య, ఎల్జేపీకి సీట్ల కేటాయింపు విషయంలో పొత్తు కుదరడం లేదు. దీంతో చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్ కలిసి బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
గత లోక్సభ ఎన్నికల్లో 100 శాతం సక్సెస్ రేట్ను దృష్టిలో ఉంచుకుని చిరాగ్ పాశ్వాన్ 243 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కేవలం 25 సీట్లనే కేటాయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభన కారణంగానే పాశ్వాన్ ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన తన జన్ సురాజ్ పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పాశ్వాన్కు ముఖ్యంగా దళిత ఓటర్లలో బలమైన ఓటు బ్యాంకు ఉండగా, ప్రశాంత్ కిషోర్కు వ్యూహాత్మక అనుభవం, యువతలో ఆదరణ ఉన్నాయి. ఈ రెండు శక్తులు కలిస్తే బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీట్ల పంపకంపై ఎన్డీఏలో తుది నిర్ణయం వెలువడకముందే, చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిషోర్ పొత్తుపై 'తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి' అని ఎల్జేపీ వర్గాలు చెప్పడం బిహార్ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తోంది.