/rtv/media/media_files/2025/10/13/a-leopard-attacked-a-farmer-2025-10-13-21-12-15.jpg)
A leopard attacked a farmer
Leopard : ఈ మధ్య దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరిగింది. దీనితో అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి విరివిగా వస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతుల మీద దాడులకు తెగబడుతున్నాయి. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై దాడి చేసిన చిరుత అతన్ని ఈడ్చుకెళ్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా లోఈ ఘోరం జరిగింది. చిరుతపులి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు, అటవీ అధికారులు గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అటవీ అధికారులు అంటున్నారు.
వారు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లా అష్తి తాలూకాలోని బావి గ్రామానికి చెందిన 36 ఏళ్ల ఓ యువరైతు పశువులను మేపేందుకు తన పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన చిరుతపులి యువకుడిపై దాడిచేసి అతన్ని లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఆ రాత్రి పశువులు ఇంటికి చేరినా రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారిని విచారించారు. చివరికి చిరుతపులి ఎత్తుకెళ్లి ఉంటుందని అనుమానించారు.
వెంటనే గ్రామస్తులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులుఘటనా ప్రాంతానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి అడవీలో గాలించగా చిరుత సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. పోస్టుమార్టం నివేదికలో చిరుత దాడిచేసిందా, మరేదైనా కారణంతో జరిగిందా అనేది కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.