Suicide : కొడుకును చంపి ఆపై ఆత్మహత్య.. ఓ ప్రభుత్వ అధికారి సంచలన నిర్ణయం

ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

New Update
suicide

suicide

 Suicide : ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తేనాంపేటలోని కేంద్ర భద్రతా విభాగ కార్యాలయంలో సీనియర్‌ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న నవీన్‌కణ్ణన్‌(38) చెన్నై అన్నానగర్‌లోని  ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయనకు భార్య నివేదిత(35), కుమారుడు లవిన్‌(7) ఉన్నారు. నివేదిత దక్షిణ రైల్వే ఉద్యోగిని. నవీన్‌ తల్లిదండ్రులు వారితో పాటే ఉంటున్నారు. 

సోమవారం రోజున ఉదయం వారి గదిలోంచి నివేదిత కేకలు వేయడంతో అత్తమామలు పరుగెత్తుకుంటూ వెళ్లి చూశారు. అప్పటికే కోడలు, మనవడు గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నారు. ప్రాణాలతో ఉన్న నివేదితను వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆ సమయంలో ఇంట్లో నవీన్‌ లేకపోవడంతో అనుమానంతో విచారణ చేపట్టారు. ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 

నివేదిత చెప్పిన వివరాల ప్రకారం నవీన్‌ స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఆ విషయం భార్యకు చెప్పారు. ఆ మొత్తం తీర్చే మార్గం లేకపోవడంతో ఇద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లవిన్‌ను గొంతుకోసి చంపిన నవీన్‌.. ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత నివేదిత తనకు తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అయితే సకాలంలో అత్తమామలు రావడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన నవీన్ తన కుమారుడిని చంపి... ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు