Bandi Sanjay: కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్‌ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.

New Update
Bandi Sanjay: కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయే స్థానాల్లో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. మానకొండూరులో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి కేసీఆర్‌ డబ్బులు ఆశ చూపి బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. పార్టీలోకి రానివారిని పాత కేసులు తోడుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిన ఆయన.. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిందన్నారు. టికెట్‌ రానివారిని కాంగ్రెస్‌లోకి పంపుతోందని, ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు మళ్లీ తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వారిని నమ్మరన్నారు. కాంగ్రెస్‌ నేతలకు టికెట్ల రావని ముందే తెలుసన్న ఆయన.. అందుకే తాము ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నామని ముందే ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదవుల కోసం గొడవపడే నాయకులు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. శనివారం చేవెళ్లలో జరిగిన ప్రజా గర్జన సభలో వీ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను నెట్టివేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా రానున్న రోజుల్లో బీజేపీ ప్రజల వద్దకు వెళ్తుందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల చీకటి ఒప్పందం గురించి ప్రజలకు తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో గ్రామ స్థాయిలో ప్రజలకు, రైతులకు వివరిస్తామని బండి సంజయ్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ మంత్రులతో ర్యాలీలు నిర్వహించబోతున్నామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు కాకుండా ఎలా మోసం చేస్తుందో వివరిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు గల్లంతవుతవ్వడం కూడా ఖాయమన్నారు.

ALSO READ: కామారెడ్డిలో కేసీఆర్‌ విజయం ఖాయం

Advertisment
తాజా కథనాలు