Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్‌ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు.

New Update
Sita  Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి

Telangana : కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి(Megha Krishna Reddy) తెలంగాణ(Telangana) లోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.70వేల కోట్లు కొట్టేసినట్లు గతంలో ప్రతిపక్ష పార్టీలు లెక్కలతో సహా చూపించగా.. ఇప్పుడు కొత్తగా మేఘా కంపెనీ మరో బండారం బయటపడింది.

మేఘా కొట్టేసిన అవినీతి సొమ్ము..
సీతారామ ప్రాజెక్టు(Sita Rama Project) లోనూ మేఘా కృష్ణారెడ్డి రీడిజైన్‌ పేరుతో వేల కోట్లు కొట్టేశారు. రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచారు. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తోంది మేఘా కొట్టేసిన అవినీతి సొమ్ము ఎంతుంటుందో. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం రూ.7500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టేసింది కూడా. అయితే ఇంత వరకు ఒక్క పని పూర్తి కాలేదు. చిన్న చిన్న పనులు చేసి వేల కోట్ల రూపాయలు నొక్కేశారు. రూ.3,32,000 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ పదేళ్లు దాటినా ఒక్క చుక్క నీరు పారలేదు. రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.2000 కోట్లు ఆనాటి సర్కారు ఖర్చు చేసింది. మరో 15 వందల కోట్లు ఖర్చు పెడితే లక్షలాది ఎకరాలకు నీళ్లు పారేవి. దీన్నే అదునుగా భావించిన మేఘా కృష్ణారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్‌ పేరిట అంచనాలు భారీగా పెంచేశాడు. దాదాపు రూ. 20వేల కోట్ల రూపాయలు నొక్కేసేందుకు పథకం రచించాడు. సీతమ్మ సాగర్‌ బ్యారేజీ, టన్నెల్‌ అంటూ  మేఘా కంపెనీ రూ.23 వేల కోట్లకు అంచనాల లెక్క చూపించింది .

భారీగా దోచేశారు: మంత్రి ఉత్తమ్
అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఇందులోనూ కాంట్రాక్టర్లు భారీగా దోచేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
ఈ రోజు ఉమ్మడి జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన సమీక్ష సమావేశం చేపట్టగా.. దేశంలో ఇంతటి కుంభకోణం ఎక్కడ జరగలేదన్నారు. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్ సీ మురళీధర్ తోపాటు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పెండింగ్ లో ఉన్న సీతారామ ప్రాజెక్టును రెండు మూడు రోజుల్లో పరిశీలించి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తామన్నారు.

ఇది కూడా చదవండి : Telangana: ఉచిత విద్యుత్ పథకం అమలు.. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌

ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు..
ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్‌ దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌ రెండు వేర్వేరుగా ఉండేవని, ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదన్నారు. దీనిపై ఇప్పటికే రూ.వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించేశారని తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చే చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు ఏడాదిలో పూర్తయ్యేవని, రూ. 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేదని తెలిపారు. ఇప్పటికి పదేళ్లు దాటింది. రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్ల మాటలు నమ్మి సీతారామ ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచి రూ.18వేల కోట్లకు తీసుకువెళ్లారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. సీతారామ సాగర్ కు మరో నాలుగు వేల కోట్లు పెంచి, దానికి సీతమ్మ బ్యారేజ్(Sitamma Barrage) అని మరోపేరు పెట్టడంతో మొత్తంగా రూ. 22,981 కోట్ల మించిపోయిందని చెప్పారు.

ప్రజా ధనం దుర్వినియోగం..
ఇక ఇదంతా ఎవరి సోమ్ము? ఎవరి జాగీరు? ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇరిగేషన్ మంత్రిగా ఈ లెక్కలు చూస్తుంటే నిర్గాంతపోతున్నా. రోజు రోజుకు బయటకొస్తున్న దోపిడి వివరాలు చూస్తే ఇలా కూడా చేయొచ్చా! అని ఆశ్చర్యమేస్తుంది. కేసీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ ప్రయోజనాలను ద్వంసం చేశారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు కూడా నీరు చేరలేదు. పాలమూరు రంగారెడ్డికి రూ.27 వేల కోట్లు పెడితే ఒక్క ఎకరం కూడా పారలేదు' అంటూ గత ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

వాళ్లు చెప్పినవన్నీ అబద్దాలే..
అలాగే సీతారామ ప్రాజెక్టు కోసం రూ.7500 కోట్లు పెడితే ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేకపోయారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ సీరియస్ ఇష్యూను కేబినేట్ లో డిస్కస్ చేసిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల బాధలు లేకుండా కష్టపడుతున్నామంటూ వాళ్లు చెప్పినదంతా అబద్దమేనని పేర్కొన్నారు. అన్నీ వాళ్లకే తెలిసినట్లు ఫీల్ అవుతారని దుయ్యబట్టారు. ఇక దేశంలో ఏదైనా జాతీయ ప్రాజెక్టును డిక్లేర్ చేస్తే దానికి 60 శాతం ఫండ్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, అయినా 10ఏళ్ల పాటు నేషనల్ ప్రాజెక్టుకు అప్లై చేయని గణత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

కాంట్రాక్టర్ల దోపిడీ చూసి బాధేస్తోంది.. డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీటి కోసమని.. కానీ కాంట్రాక్టర్ల దోపిడీ చూస్తే బాధేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపై వివరంగా అధికారులందరినీ కూర్చోబెట్టుకుని రివ్యూ చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి డిజైన్‌ చేసిన రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టు వ్యయం రూ.1,681 కోట్లని.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే రూ.889 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరాసాగర్‌ మొత్తం వ్యయం రూ.1,824 కోట్లని.. ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై ఖర్చు చేసింది రూ.1,064 కోట్లని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇంకా ఖర్చు చేయాల్సింది కేవలం రూ.1,552 కోట్లు మాత్రమేని, ఇది పట్టించుకోకుండా రీడిజైన్ పేరుతో కొత్తవి తీసుకొచ్చారని విమర్శించారు.  దీనికి అదనంగా సీతమ్మ సాగర్‌ బ్యారేజీ అని ప్రారంభించి, దాని వ్యయం రూ. 4,481 కోట్లుగా పేర్కొన్నారన్నారు. కేవలం రూ.1,581 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.22,981 కోట్లకు పెంచారని, ఇంత దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజల సహకారం కావాలని కోరారు.

కడుపు తరుక్కుపోతుంది..
ఇన్ని రకాల దోపిడీలకు పాల్పడి, మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు అద్భుతాలు చేశామంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. మొదటి మూడు ఏళ్లలోనే సంవత్సరానికి రూ. 500 కోట్లు ఖర్చు చేసినా 4 లక్షల ఎకరాలు నీళ్లు పారేటివన్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజల అందరి సహకారం కావాలన్నారు. ఈ సొమ్మంతా ప్రజలదేనని, ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడలన్నారు. ప్రాణాలు తెగించి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇలాంటి దోపిడిని చూస్తూ ఊరుకోమన్నారు.

Also Read : Ayodhya Ram lalla Idol: అయోధ్య బాల రాముని విగ్రహం పై దశావతారాలు!

Advertisment
తాజా కథనాలు