Telangana: సరిహద్దు జిల్లాల్లో పొలిటికల్‌ హీట్‌.. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్న కర్ణాటక రైతులు..

తెలంగాణలో కర్ణాటక రైతల కాంగ్రెస్ వ్యతిరేక నిరసనలు సంచలనం రేపుతున్నాయి.మొన్న గద్వాల్‌ జిల్లాలో నిరసన చేసిన రైతులు.. తాజాగా రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో ఆందోళనలు చేపట్టారు. కర్నాటకలో ఐదు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక పోతోందని కళ్యాణ్ కర్ణాటక రైతు సంఘం నేతలు ఆరోపించారు.మరోవైపు తెలంగాణలో రైతులను అబద్దాలతో నమ్మించలేక డబ్బులిచ్చి కర్ణాటక నుంచి రైతుల పేరుతో పెయిడ్‌ బ్యాచ్‌ను దింపి బీఆర్‌ఎస్‌ ప్రచారాలు చేయుస్తోందని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

Telangana: సరిహద్దు జిల్లాల్లో పొలిటికల్‌ హీట్‌.. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్న కర్ణాటక రైతులు..
New Update

తెలంగాణలోని కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో సరికొత్త రాజకీయం నడుస్తోంది. ఎన్నికల వేళ సరిహద్దులు దాటి తెలంగాణలోకి వస్తున్న కర్ణాటక రైతులు కాంగ్రెస్‌ వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. మొన్న గద్వాల్‌ జిల్లాలో, తాజాగా రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో కర్ణాటక రైతులు ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. అయితే వారిని కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డగించడంతో పాటూ రేవంత్‌ రెడ్డి నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బుధవారం మధ్యాహ్నం నాటికి 200 మంది కర్నాటక రైతులు కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని ప్లకార్డులతో కర్నాటక రైతులు ప్రదర్శన చేపట్టారు. అంతకుముందు మంగళవారం కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు కర్ణాటక రైతులు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని నమ్మి మోసపోయామని, తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తప్పు చేయొద్దని కోరారు.

కరెంట్ హామీలపై కన్నెర్ర

కర్నాటకలో ఐదు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక పోతోందని కళ్యాణ్ కర్ణాటక రైతు సంఘం నేతలు ఆరోపించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలంటూ ప్రజల ముందుకు వచ్చిందనీ, ఆ గ్యారెంటీలను నమ్మితే మాత్రం మోసపోవడం గ్యారెంటీ అంటూ జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. '7 గంటల కరెంట్‌ అంటారు.. 3 గంటలే ఇస్తారు.. తస్మాత్‌ జాగ్రత్త' అంటూ ప్లకార్డులూ ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో రైతులతో పాటూ సామాన్యులు సైతం విద్యుత్ కోతలతో ఇబ్బందిపడుతున్నారని ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఎదురుదాడి

మరోవైపు తెలంగాణలో రైతులను అబద్దాలతో నమ్మించలేక డబ్బులిచ్చి కర్ణాటక నుంచి రైతుల పేరుతో పెయిడ్‌ బ్యాచ్‌ను బీఆర్‌ఎస్‌ రంగంలోకి దించిందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కేసిఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఎన్ని కుట్రలు చేసినా... తెలంగాణ రైతులు బీఆర్ఎస్‌ను కలుపులాగా పీకి పారేయడం ఖాయమంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్లు ప్రొటెస్ట్ చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అన్న కేటీఆర్‌... ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడంటూ విమర్శిస్తున్నారు. రైతుల పేరుతో కర్ణాటక నుండి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌ చేస్తే మాత్రం శాంతి వికసిస్తుందా? అంటూ బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తున్నారు.

#telangana-elections #telugu-news #congress #brs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe