/rtv/media/media_files/2026/03/01/isreal-2026-03-01-09-03-01.jpg)
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణవార్తతో ఇప్పుడు ఇరాన్ తదుపరి వారసుడు ఎవరనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ రాజ్యాంగంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు వ్యక్తుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఇందులో ఒకరు మొజ్తబా ఖమేనీ ఈయన అలీ ఖమేనీ కుమారుడు. తండ్రికి అత్యంత నమ్మకస్తుడిగా, తెరవెనుక రాజకీయాలను నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, వారసత్వంగా అధికారం ఇవ్వడాన్ని ఇరాన్ ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకం.ఇక మరో పేరు హసన్ ఖొమేనీ ఈయన ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా ఖొమేనీ మనవడు. ఈయనకు మత పెద్దలలో మంచి గుర్తింపు ఉంది.
లీడర్ను ఎంపిక చేసే బాధ్యత
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించడంతో సైన్యంలోనూ నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెస్కియాన్ పరిస్థితి కూడా ప్రస్తుతం అయోమయంలోనే ఉంది. ఆయన నివాసాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం రావడంతో, దేశాన్ని నడిపించే నాయకత్వం ఇప్పుడు శూన్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ పీఠాన్ని కేవలం మతపరమైన పండితుడు మాత్రమే అధిష్టించగలరు. అయితే, యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో సైన్యం కచ్చితంగా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంది. తదుపరి కొన్ని గంటలు ఇరాన్ భవిష్యత్తును తేల్చనున్నాయి.
Follow Us