India-US trade deal: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!

భారత్, అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికా కీలక మార్పులు చేసింది. మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న పప్పుధాన్యాల ప్రస్తావన తొలగించింది. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు, రైతుల వ్యతిరేకతతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
modi-trump

PM Modi- Trump

భారత్, అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న పప్పుధాన్యాల ప్రస్తావనను తాజాగా తొలగించింది. దీంతో భారత ప్రభుత్వానికి, రైతులకు కొంత ఉపశమనం కలగనుంది. కేంద్ర అభ్యంతరాలు, భారతీయ రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్ ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా విధిస్తున్న 50% సుంకాలు 18%కి తగ్గడం వల్ల భారతీయ టెక్స్‌టైల్, ఫార్మా, హస్తకళల రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. అయితే, ఫిబ్రవరి 9న వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో "కొన్ని రకాల పప్పుధాన్యాలపై భారత్ సుంకాలను తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి అంగీకరించింది" అని పేర్కొన్నారు. ఇది భారత్‌లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.

భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ.. పప్పుధాన్యాలు, గోధుమలు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తి రక్షణ ఉందని, వాటిపై ఎలాంటి సుంకాలు తగ్గించలేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రకటనతో ఆగ్రహించిన రైతు సంఘాలు, ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఈ ఒప్పందం భారత రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపించాయి. అమెరికా నుంచి చౌకగా పప్పుధాన్యాలు దిగుమతి అయితే దేశీయంగా ధరలు పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా వెనక్కి తగ్గడం 

భారత్ నుండి వ్యక్తమైన అభ్యంతరాలతో వైట్ హౌస్ ఫిబ్రవరి 10న తన ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించింది. సవరించిన నివేదికలో 'Certain Pulses' (కొన్ని పప్పుధాన్యాలు) అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. గతంలో భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలుకు "కట్టుబడి ఉంది" అని పేర్కొనగా, ఇప్పుడు దానిని "ఉద్దేశిస్తోంది" అని మార్చారు. ఇది చట్టబద్ధమైన నిబద్ధత కాదని, కేవలం ఒక లక్ష్యం మాత్రమేనని స్పష్టమవుతోంది. పప్పుధాన్యాలను తొలగించినప్పటికీ, ఇతర కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు కొనసాగుతోంది. డ్రై ఫ్రూట్స్, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ఐటీ ఉత్పత్తులు అమెరికా నుంచి దిగుమతి కానున్నాయి. ఇండియన్ మార్కెట్‌లో పప్పుధాన్యాలు అత్యంత సున్నితమైన అంశం. అమెరికా తన ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించడంతో ఇక్కడి వ్యవసాయ రంగ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు