Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు. 

New Update
Trump

Trump

ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ ట్రంప్ అన్ని దేశాల మీదా సుంకాలతో విరుచుకుపడుతున్నారు. తన మాట వినకపోయినా కూడా సుంకాలతో దాడి చేస్తున్నారు. ప్రతీ దాని మీదనా టారీఫ్ లు విధిస్తూ చాలా దేశాలకు తలనొప్పిగా మారారు. ఇండియా, చైనాలాంటి దేశాల మీద అయితే అదనపు సుంకాలతో వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉన్నారు. సొంత దేశంలోనే ఇది అన్యాయమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సుంకాల కారణంగా అమెరికా ఆర్థికంగా పతనం అవుతున్నా వాటి విషయంలో మాత్రం తగ్గడం లేదు. దీంతో టారిఫ్ లను వ్యతిరేకిస్తూ కొంత మంది  న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అధ్యక్షుడు ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మిగతా దేశాలు చేస్తుంటే నేనెందుకు చేయకూడదు..

ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో సుంకాల పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికా భద్రతకే పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. సుంకాల వలన వందల బిలియన్ డాలర్లు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో వీటి వల్ల మరిన్ని అద్భుతాలను చూస్తారని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు టారిఫ్ లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అమెరికాకు ఆర్థిక రక్షణ లేకుండా పోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇతర దేశాలు తమ దేశం విషయంలో ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో తాము కూడా అలాగే బదులు చెబుతామని.. ఆ విధంగా ప్రవర్తించొద్దంటూ తమను ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని అన్నారు. సుంకాల వలనే అమెరికా జాతీయ భద్రత మెరుగుపడిందని తెలిపారు.

మరోవైపు మళ్ళీ సుంకాల పేరుతో భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇండియా తమకు మిత్ర దేశమని అంటారు. ప్రధాని మోదీ(PM Modi) తనకు మంచి స్నేహితుడని చెబుతూనే .. ట్రంప్ మాత్రం భారత్ పై కొత్త కొత్త సుంకాలను(trump tariffs) విధిస్తున్నారు. ఒకవైపు భారత్  వాణిజ్య చర్చలు సాగిస్తూనే మరోవైపు సుంకాలను బాదేస్తున్నారు. తాజాగా భారత బియ్యంపై సుంకాలను విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచంలోనే నంబర్ వన్ బియ్యం ఎగుమతిదారుగా, డజన్ల కొద్దీ దేశాలకు భారతీయ బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.  ఆయన చర్యలు అంతర్జాతీయ ఆహార సరఫరా గొలుసుకు అతి పెద్ద ఆటంకంగా మారుతుందని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు