Charlie Kirk: కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి రాష్ట్రపతి మెడల్ ప్రకటించిన ట్రంప్

అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త చార్లీ కిర్క్‌ మరణించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రకటించారు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్(31)పై కాల్పులు జరిగాయి.

New Update
Presidential Medal of Freedom for Charlie Kirk

అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజకీయ వ్యాఖ్యాత చార్లీ కిర్క్‌ మరణించిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రకటించారు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ (31)పై కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కిర్క్ మృతి పట్ల ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, చార్లీ కిర్క్ ఈ తరానికి ఓ గొప్ప వ్యక్తి అని, ఓ అసాధారణమైన పోరాట యోధుడని, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాడని కొనియాడారు. "చార్లీ గొంతుక, అతను ఎంతో మంది, ముఖ్యంగా యువత హృదయాల్లో నింపిన ధైర్యం కలకాలం నిలిచిపోతాయని నాకు నమ్మకం ఉంది" అని ట్రంప్ తెలిపారు.

యువత కోసం చార్లీ కిర్క్ 'టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ' అనే సంస్థను స్థాపించారు. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. యూఎస్‌లో కన్జర్వేటివ్ ఆలోచనలను ప్రోత్సహించడంలో చురుకుగా పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం చార్లీ కిర్క్ హత్యపై ఎఫ్‌బిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అమెరికాలో సైనిక గౌరవం లేని అత్యున్నత పౌర పురస్కారం. ఇది దేశ భద్రత, శాంతి, సంస్కృతి లేదా ఇతర ముఖ్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అందజేస్తారు.

సోషల్ మీడియాలో చార్లీ కిర్క్‌ని షూట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 'అమెరికన్ కమ్‌బ్యాక్ టూర్'లో వేలాది మంది విద్యార్థుల ముందు ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుండగా, ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. షాక్‌కు గురైన ప్రేక్షకులు అరిచి, భయంతో పరుగులు తీశారు. చార్లీ కిర్క్ మెడలోంచి రక్తం కారడం, ఆయన కుర్చీలో వెనక్కి వాలిపోవడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. కిర్క్ ప్రసంగిస్తున్న ప్రదేశానికి 200 గజాల దూరంలో ఉన్న ఒక భవనం పైనుంచి కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది చార్లీని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన అనంతరం పోలీసులు విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా మూసివేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దారుణమైన ఘటన అమెరికాలో రాజకీయ నాయకుల భద్రత, పెరుగుతున్న రాజకీయ హింసపై తీవ్ర ఆందోళనలను పెంచింది.

Advertisment
తాజా కథనాలు