/rtv/media/media_files/2025/10/18/pakistan-2025-10-18-16-16-40.jpg)
Pakistan committing terrorist attacks targeting innocent people in India, Know Details
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న శత్రుత్వం గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. 1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. జమ్మూకశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడులకు పాకిస్థాన్, పాక్ ఉగ్రవాద సంస్థలే ఉన్నాయని భారత్ ఆరోపణలు చేస్తోంది. అమాయక పౌరులే లక్ష్యంగా అనేక దాడులు చేసినట్లు చెబుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది భారతీయ పౌరులు మరణించారని, మరికొందరు గాయాలపాలయ్యిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉగ్ర దాడుల్లో భారత సైనికులు కూడా ఇప్పటిదాకా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై బాంబు పేలుళ్లు (1993)
1993 మార్తి 12న ముంబైలో 12 చోట్ల వరుసగా బాంబు పేళ్లుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ దాడి వెనుక దావుద్ ఇబ్రహీంకి చెందిన డి కంపెనీ మూఠా హస్తం ఉందని.. అలాగే పాక్ గూఢచార సంస్థ (ISI) మద్దతు ఉందని ఆరోపణలు ఉన్నాయి.
ఎర్రకోటపై దాడి (2000)
2000, డిసెంబర్ 22న ఢిల్లీలోని ఎర్రకోటపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. లష్కరే తొయిబా అనే ఉగ్ర సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఆ రోజున రాత్రి 9 గంటలకు ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఎర్రకోట ఆవరణలోకి చొరబడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న 7వ రాజ్పుతానా రైఫిల్స్ బెటాలియన్కు చెందిన సైనికులు, భద్రతా గార్డులపై కాల్పులు జరిపారు. భారత సైనికులు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.
ముంబైలో తాజ్ హోటల్పై దాడి (2008)
ముంబైలోని 2008, నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అలాగే ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఛాబాద్ హౌస్ వంటి ప్రాంతాలపై కూడా దాడులకు పాల్పడ్డారు. మొత్తం 12 వేర్వేరు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో 166 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు.
2016 పఠాన్కోట్, ఉరీ దాడి
2016, జనవరి 2న పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. అలాగే అదే ఏడాది సెప్టెంబర్ 18న జమ్మూకశ్మీర్లోని ఉరీ వద్ద భారత సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
పుల్వామా ఉగ్రదాడి దాడి (2019)
2019, ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై CRPF కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి జరగడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ విషాద ఘటనలో 40 మంది జవాన్లు మరణించారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఆ తర్వాత భారత్ పాక్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై కాల్పులు జరిపింది.
పహల్గాం ఉగ్రదాడి (2025)
ఈ ఏడాది ఏప్రిల్ 26న జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడి జరిగంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. లష్కరే తోయిబాకు (LeT) ఇది అనుబంధ సంస్థగా ఉంది. ఈ దాడుల తర్వాత భారత సైన్యం పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్కు చెందిన ఉగ్రసంస్థలు ముఖ్యంగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేస్తోంది. ఈ ఉగ్రసంస్థలను పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు పాక్ పాల్పడుతున్న ఉగ్రదాడులకు కూడా భారత్ గట్టిగా బదులిస్తోంది. అయినప్పటికీ పాక్ బుద్ధి మాత్రం మారడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర రక్షణ శాఖ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలాగే ఆపరేషన్ సిందూర్ను కూడా ఇంకా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
అఫ్గాన్ క్రికెటర్లు మృతి
మరోవైపు పాకిస్థాన్--అఫ్గానిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ సరిహద్దుల్లోని తూర్పు పాక్తిక ప్రావిన్స్లో పాక్ సైన్యం బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లు మృతి చెందడం కలకలం రేపింది. క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు సైతం ప్రాణాలు విడిచారు.