/rtv/media/media_files/2025/06/18/Volcanic eruption-fe6860de.jpg)
Volcanic eruption
Volcanic eruption : ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విస్పోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 10 వేల మీటర్లు (32,800 అడుగుల మేర) కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది.
ఈ అగ్నిపర్వతం విస్పోటనంతో దానికి సమీపంలో ఉన్న బాలికి వెళ్లా్ల్సిన ఎయిరిండియా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలోపెట్టుకొని.. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్లో ఉన్న విమానాశ్రయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు.
నుసా టెంగారా ప్రావిన్స్లోని లెవోటోబి లకి-లకి పర్వతం విస్ఫోటనం కారణంగా దాదాపు 11 కి.మీ. ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్ళీ విస్ఫోటనం సంభవించడంతో 1 కి.మీ. ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ఇండియా తెలిపింది.పలు నిర్వహణ సమస్యలతో మంగళవారం ముంబయి నుంచి లఖ్నవూకు వెళ్లే ఎయిరిండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది.ప్రయాణికులకు ఎయిర్పోర్టులో బస ఏర్పాటుచేసి, బుధవారం వారిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసినట్లు వెల్లడించింది.