/rtv/media/media_files/2025/09/07/drugs-case-2025-09-07-19-28-35.jpg)
చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కంపెనీ రహస్యాలు బయటపెట్టడానికి పోలీసులు రజినీ కాంత్ కూలీ సినిమా రేంజ్లో సీక్రెట్ ఆపరేషన్ చేశారు. వాగ్దేవీ ల్యాబొరేటరీస్పై పోలీసులు ఆకస్మిక దాడులు చేయగా.. డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ ఓనర్ గతంలో కూడా పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో తేలింది. తన పలుకుబడితో డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. ముంబయిలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న బంగ్లాదేశీ మహిళను అరెస్టు చేసి.. కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ ల్యాబొరేటరీలో డ్రగ్స్ తయారీ యూనిట్ విషయం బయటపడింది.
ఈ క్రమంలో ముంబయి నార్కోటిక్ పోలీసులు వాగ్దేవీ ల్యాబొరేటరీస్పై స్టింగ్ ఆపరేషన్ చేశారు. ముంబయి పోలీసుల్లో ఓ ఆఫీసర్ రోజు కూలీలా ల్యాబొరేటరీస్లో చేరారు. నెల రోజులపాటు కంపెనీలో అన్నీ తెలుసుకొని.. ప్లాన్ చేసి వివరాలను పక్కాగా సేకరించారు. తర్వాత శనివారం పోలీసులు దాడి చేసి రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్, ఎండీ డ్రగ్స్ తయారీకి వినియోగించే 35,500 లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 5.79కిలోల మెఫిడ్రోన్, 950 కిలోల పొడి పదార్థం, మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ వెనుక ఎవరెవరు ఉన్నారనేది ఇంకా వివరాలు రాబడుతున్నారు.