/rtv/media/media_files/2025/09/29/shoting-on-church-2025-09-29-07-14-32.jpg)
అమెరికాలో ఒకే రోజు కొన్ని గంటల వ్యవదిలో రెండుసార్లు మాస్ షూటింగ్ జరిగింది. అందులో ఒకటి రెస్టారెంట్పై జరిగితే.. మరోకటి చర్చ్లో చోటుచేసుకుంది. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిచిగాన్లోని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్లో ఉన్న 'చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్' (మార్మోన్ చర్చి)లో ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తుపాకీతో కారులో వచ్చిన వ్యక్తి చర్చి ముందు తలుపులను ఢీకొట్టి, లోపలికి ప్రవేశించాడు. తర్వాత ప్రార్థన చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు చర్చికి నిప్పంటించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నాడని, మరో ఇద్దరు చర్చిలో చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. నిందితుడిని బర్టన్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది క్రైస్తవులపై జరిగిన దాడిగా ఆయన ఖండించారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేస్తూ, "మిచిగాన్లోని ఈ దారుణమైన కాల్పుల గురించి నాకు తెలిసింది. ఇది క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని చేసిన మరో దాడిగా కనిపిస్తోంది. మన దేశంలో ఈ హింసాకాండ తక్షణమే అంతమొందాలి!" అని ట్రంప్ పేర్కొన్నారు. ఎఫ్బీఐ (FBI) వెంటనే రంగంలోకి దిగి స్థానిక అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
చర్చి కాల్పులు, ఆ తర్వాత చెలరేగిన మంటల కారణంగా భవనం ధ్వంసమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. గాయపడిన ఎనిమిది మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి గల కారణాలు, నిందితుడి ఉద్దేశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.