Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ వరుస పాన్ ఇండియా సినిమాలు.. లైనప్ చూస్తే మైండ్ పోవాల్సిందే..!

మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో 10 భారీ సినిమాలను లైన్‌లో పెట్టింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అజిత్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్‌లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తోంది.

New Update
Mythri Movie Makers

Mythri Movie Makers

Mythri Movie Makers: తెలుగు సినిమా పరిశ్రమలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది. ఇప్పుడు ఈ సంస్థ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా భారీ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ముందుకెళ్తోంది. చిన్న, మధ్యస్థ సినిమాలతో పాటు భారతీయ సినీ చరిత్రలో నిలిచే పెద్ద ప్రాజెక్ట్‌లను మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం లైన్‌లో ఉన్న ముఖ్యమైన సినిమాల వివరాలు ఇవి.

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ హిట్ మూవీ ‘థెరి’కి ఇది రీమేక్. అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి 2026 మార్చిలో విడుదల కానుంది.

పెద్ది (కో-ప్రొడక్షన్) (Peddi)

రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చిలో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఫౌజీ (Fauzi)

ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

డ్రాగన్ (Dragon)

ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ‘డ్రాగన్’. హై వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా ( Ram Charan - Sukumar)

‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ వేసవి తర్వాత ప్రారంభమవుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం 2027లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

జై హనుమాన్ (Jai Hanuman)

‘హనుమాన్’ సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ కథకు చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. భక్తి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా ( AA 23 )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతిష్టాత్మక సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్.

అజిత్ - అధిక్ రవిచంద్రన్ సినిమా

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సూపర్ హిట్ తర్వాత అజిత్, అధిక్ రవిచంద్రన్ మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. ఈ తమిళ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

రజనీకాంత్ సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చింది. ఆయన వచ్చే ఏడాది ఈ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ సినిమా

సల్మాన్ ఖాన్‌కు భారీ అడ్వాన్స్ ఇచ్చిన తొలి టాలీవుడ్ నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ నిలిచింది. రాజ్ అండ్ డీకే ప్రస్తుతం కథపై పని చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తంగా చూస్తే, మైత్రీ మూవీ మేకర్స్ రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Advertisment
తాజా కథనాలు