AP : ఇళ్లు లేని పేదలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. త్వరలో 10 లక్షల ఇళ్లు

ఏపీ సర్కార్‌ ఇళ్లులేని నిరుపేదలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

New Update
AP Sarkar Goodnews for Homless Poor

AP Sarkar Goodnews for Homless Poor

AP : ఏపీ సర్కార్‌ ఇళ్లులేని నిరుపేదలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్న ఆయన వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు.


 ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. బుధవారం అమరావతిలోని సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్లులేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా తయారు చేయాలని ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ పెద్ద కుటుంబాలు ఉంటే వారికి ఉమ్మడి ఇళ్లు నిర్మించే ఆలోచన చేయాలన్నారు.  

కాగా ఏపీకి పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ, పీఎంఏవై (గ్రామీణ్), పీఎం జన్మాన్ తదితర పథకాల కింద మొత్తం 18,59,504 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికి 9,51,351 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఏడాది కాలంలోనే 2.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వచ్చే నెలలో మరో 19 వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2,013.50 కోట్లు ఖర్చు చేసిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది.  అలా పూర్తయిన 4,305 లేఅవుట్లలో... రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు వంటి మౌలికవసతుల కల్పనకు రూ.3,296.58 కోట్లు ఖర్చు చేయనుంది. కుప్పం నియోజకవర్గంలో 4,647 మంది గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.16.37 కోట్లు చెల్లించారు. రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్దిదారులకు రూ.919.29 కోట్లు త్వరలో చెల్లించనున్నారు. పీఎం జన్మాన్‌ కింద నిర్మించిన 15,753 ఇళ్లకు రూ.100 కోట్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద నిర్మించిన 15,582 ఇళ్లకు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. మరోవైపు పీఎంఏవై అర్బన్ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ 1,84,510 మంది లబ్దిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు వివరించారు.

2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4,54,706 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వీటిలో ప్రస్తుతం 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో 300 చ.అ. విస్తీర్ణం కలిగిన 45,848 ఇళ్లు, 365 చ.అ. విస్తీర్ణం ఉన్న 12,550 ఇళ్లు, 430 చ.అ. విస్తీర్ణం ఉన్న 25,172 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 83,570 ఇళ్లను లబ్దిదారులకు ప్రభుత్వం అందించగా మరో 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

Advertisment
తాజా కథనాలు