మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ జరగనుంది. అయితే ఈ పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్ తెలిపింది. వీధి వ్యాపారులు, సహాయక సంఘాలకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు యోగీ సర్కార్ చర్యలు చేపట్టింది. దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో దీపావళి మేళా నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పట్టణ జీవనోపాధి మిషన్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణ పౌరులకు ఉపయోగపడే ఉత్పత్తులను ఒకేచోట అందించడానికి ఈ మేళాను నిర్వహిస్తున్నామని పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఏకే శర్మ పేర్కొన్నారు.
Also Read: మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్
ఈ మేళా నిర్వహించడం వల్ల వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం అందుతుందని తెలిపారు. ఇందుకోసం ఈ మేళాకు ప్రత్యేక పార్కింగ్ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇక ఈ మేళా జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే గత ఏడాది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలా మేళాను నిర్వహించింది. దీనివల్ల వీధి వ్యాపారులు, సహాయక సంఘాలకు అదనంగా ఆదాయం వచ్చింది. అందుకోసమే ఈ ఏడాది కూడా దీన్ని నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలాఉండగా.. దీపావళి సందర్భంగా యోగీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, బోనస్లను కానుకగా ఇచ్చింది. అంతేకాదు గృహిణులకు పీఎం ఉజ్వల పథకం కింద రెండు ఉచిత సిలిండర్లను బహుమతిగా కూడా అందించింది. ఈ నేపథ్యంలోనే వీధి వ్యాపారులకు దీపావళి మేళా ద్వారా అదనపు ఆదాయానికి మార్గం చూపిస్తోంది.
Also Read: సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామా చేయాలంటూ డిమాండ్