రిగ్గింగ్ చేసి వల్లభనేని వంశీ గెలిచారంటూ యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు

గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గెలుపుపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా ఎమ్మెల్యేగా వంశీ గెలిచారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉన్న తనను గన్నవరం తీసుకొచ్చిన జగన్ రోడ్డు మీద పడేస్తారని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
రిగ్గింగ్ చేసి వల్లభనేని వంశీ గెలిచారంటూ యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు

జగన్ తనకు అన్యాయం చేయరు..

రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలిచారంటూ గన్నవరం వైసీపీ(YCP) నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకో 300 ఓట్లు వచ్చి ఉంటే గన్నవరానికి ఈ కర్మ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి(CM YS Jagan) తనకు అన్యాయం చేస్తారని అనుకోవడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరపున సీటు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా నుంచి తనను ఇక్కడికి తీసుకొచ్చిన జగన్.. ఒంటరిగా రోడ్డు మీద పడేస్తారని ఊహించడం లేదన్నారు. ఒక్కడిగా గన్నవరం వచ్చా.. ఇప్పుడు ఓ కుటుంబం తనకు ఏర్పడిందన్నారు.

గరం గరంగా గన్నవరం.. 

కొంతకాలంగా గన్నవరం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా కానీ ప్రజలకు, కార్యకర్తలకి కాదన్నారు. టీడీపీ(TDP) నుంచి గెలిచిన వల్లభనేని వంశీకి వైసీపీలో ఎందుకు స్థానం ఇచ్చారో అధిష్టానాన్నే అడగాలని సూచించారు. గత ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం టిక్కెట్ ఇస్తానని తెలిపిన జగన్.. అనివార్య కారణాలవల్ల గన్నవరం టికెట్ ఇచ్చారని తెలిపారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని యార్లగడ్డ వెల్లడించారు. కచ్చితంగా 2024లో వైసీపీ తరపున తాను పోటీ చేస్తానని మరోసారి స్పష్టంచేశారు. యార్లగడ్డ తాజా వ్యాఖ్యలతో గన్నవరం రాజకీయాలు గరం గరంగా మారాయి.

టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం?

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పరిణామాలతో వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో గన్నవరం వైసీపీలో గందరగోళం నెలకొంది. వంశీ, యార్లగడ్డ వెంకట్రావు రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగంగానే దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. గన్నవరం నుంచి వంశీకి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాను గన్నవరం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ ప్రకటించడం.. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కూడా యార్లగడ్డకే మద్దతు తెలపడంతో నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి. ఒకవేళ టికెట్ వంశీకి ఇస్తే యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి గన్నవరం రాజకీయాలు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

Also Read: ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే

Advertisment
Advertisment
తాజా కథనాలు