/rtv/media/media_files/2025/10/17/principals-death-2025-10-17-16-02-38.jpg)
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పరీక్షలని వాయిదా వేయించడానికి విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో సమగ్ర మూల్యాంకన పరీక్షలు జరుగనున్నాయి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ కాలేదని కొందరు విద్యార్దులు ఏకంగా తమ ప్రిన్సిపాల్ చనిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు పుటించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, ఇండోర్లోని ఓ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, కొందరు విద్యార్థులు పరీక్షలకు సరిగా చదువుకోలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేయించేందుకు ఓ ప్లాన్ వేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ మరణించారని, అందుకే పరీక్షలు వాయిదా వేయబడ్డాయని సోషల్ మీడియా గ్రూపుల్లో, మెసేజింగ్ యాప్లలో మెసేజ్లను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ ఆకస్మిక మరణం కారణంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో జరుగాల్సిన కాలేజీ ఆన్లైన్ పరీక్షలు, తరగతులు వాయిదా పడ్డాయి’ అన్న సందేశాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఈ పుకారు కాసేపట్లోనే విద్యార్థులందరిలో వ్యాపించింది. కొన్ని గంటల్లోనే ఈ ఫేక్ న్యూస్ కాలేజీ యాజమాన్యం దృష్టికి చేరింది. ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నారని, తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలుసుకున్న యాజమాన్యం షాక్ అయ్యింది. పుకార్లను నమ్మి విద్యార్థులు ఆందోళన చెందడంతో, కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించింది. ప్రిన్సిపాల్ మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ఇది పరీక్షలను వాయిదా వేయించేందుకు కొందరు విద్యార్థులు చేసిన పనే అని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ మృతి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పుకార్లు వ్యాప్తి చేసిన విద్యార్థులను గుర్తించేందుకు అంతర్గత విచారణకు ఆదేశించింది. పరీక్షలను వాయిదా వేయించడానికి ఇంత దిగజారి ప్రవర్తించిన విద్యార్థుల తీరుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న బాధ్యతారాహిత్యాన్ని, పరీక్షలపై వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.