/rtv/media/media_files/2025/10/08/mahesh-2025-10-08-21-31-10.jpg)
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని, కచ్చితంగా విజయం సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల నోటి నుంచి ముద్ద లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి, ఇప్పుడు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గురువారం ఉదయం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, 90 శాతం సీట్లు గెలుచుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికే పార్టీ టికెట్ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో గెలిచిన విధంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ శకం ముగిసిందని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ రాజకీయ ముఖచిత్రంలో ఉండదని జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైందని వ్యాఖ్యానించారు.
హైకోర్టులో బిగ్ ట్విస్టు
బీసీ రిజర్వేషన్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బిగ్ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. రేపు మరిన్ని వాదనాలు వినిపిస్తామని ఏజీ వెల్లడించారు. రేపటి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది.
మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,963 ఎంపీటీసీ స్థానాలకు.. 292 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 11వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అక్టోబర్ 23వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. సుమారు 3000 - 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు. అలాగే, జిల్లా పరిషత్ల ఎన్నికల కోసం ప్రతి మండలాన్ని ఒక జెడ్పీటీసీ స్థానంగా పరిగణిస్తారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టవచ్చు.