ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!

కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలతో ఈ నెల రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మార్పులు రానున్నాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడు కూడా రానున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అంశం కూడా ఈ నెలలోనే తేలనుంది.

New Update
Telangana Sankranthi 2025

ఈ సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్ పూర్తి స్థాయిలో మరిపోనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరెస్టులు, కేసులు తప్పా రాష్ట్రంలో పెద్దగా పొలిటీకల్ యాక్టివిటీస్ లేవు. అయితే.. సంక్రాంతి తర్వాత అన్ని పార్టీల్లో కీలక మార్పులు రానున్నాయి. స్థానిక ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు బిగ్ ఛాలెంజ్ గా మారనున్నాయి. మరోసారి సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, గత వైభవం కోసం బీఆర్ఎస్.. బలం చాటడం కోసం బీజేపీ ఈ ఎన్నికల్లో పోరాడనున్నాయి. అత్యంత సున్నిత అంశాలైన కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలపై కూడా మరో నెలరోజుల్లోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం, ప్రధాన పార్టీల్లో రానున్న మార్పులు ఇలా ఉన్నాయి.

కుల గణన, ఎస్సీ వర్గీకరణపై రిపోర్టులు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుల గణనను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఈ నెలలోనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా తేలనుంది. మరో వైపు ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ కూడా మరో నెలలోపే ప్రభుత్వానికి చేరనుంది. దీంతో ఈ రిపోర్టులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఏమాత్రం తగ్గినా బీసీ సంఘాలు ఊరుకునే అవకాశం కనిపించడం లేదు. ఎస్సీ వర్గీకరణ వద్దని మాలలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. 

మంత్రివర్గ విస్తరణ: 

మంత్రి వర్గ విస్తరణకు సైతం ముహూర్తం ఖారారైందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరో నెల రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇద్దరిని కేబినెట్ నుంచి తప్పించనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. దీంతో ఇన్నాళ్లు మంత్రి పదవిపై ఆశపెట్టుకుని దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. వారిని బుజ్జగించడం సీఎం రేవంత్ కు బిగ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి.

కీలక పథకాల అమలు:

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీకి సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ పథకాలు స్థానిక ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. 

కాంగ్రెస్ పూర్తి స్థాయి కార్యవర్గం 

పీసీసీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటుకు కూడా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. దీంతో కార్యవర్గంలో చోటు దక్కని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. వీరికి నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు దక్కని వారు గొంతు కలిపితే కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవు. రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌ అందరినీ సంతృప్తి పరిచేలా నామినేటెడ్, పార్టీ పదవులు ఎలా పంచుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

బీఆర్ఎస్ ను నడిపేదెవరు?

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమై కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్, హరీశ్‌ కు ఈ నెలలోనే నోటీసులు ఇస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఆ పార్టీకి మరింత ఇబ్బందులు తప్పవు. ఒక వేళ కేటీఆర్ అరెస్ట్ అయితే.. కేసీఆర్ బయటకు వచ్చి పార్టీని నడిపిస్తారా? లేక హరీశ్‌ రావు లేదా కవితలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశం కూడా కీలకంగా మారనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ఆ పార్టీకి చాలా అవసరం. ఒక వేళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే శ్రేణులు నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 

బీజేపీకి కొత్త సారథి..

మరికొన్ని రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని అగ్రనేతలు సైతం చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లతో బీజేపీలో ఫుల్ జోష్ వ్యక్తమైంది. దీంతో రెండో స్థానంలో తామే అని నేతలు చెప్పుకున్నారు. అయితే.. అనంతరం ప్రెస్ మీట్లకే ఆ పార్టీ పరిమితం అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లో తప్పా క్షేత్ర స్థాయిలో పెద్దగా ఎక్కడ హడావుడి కనిపించలేదు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే.. మళ్లీ పాత ప్లేస్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందన్న భయం పార్టీ శ్రేణుల్లో ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు, కొత్త అధ్యక్షుడి దూకుడుపైనే ఆ పార్టీ భవితవ్యం ఆధారపడనుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు