BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు!

2025లో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్స్ రీవాల్యూయేషన్ చేసి, మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తుది లిస్ట్ ప్రకటనకు 8 వారాల డెడ్ లైన్ విధించింది.

New Update
group 2

Telangana Group-2 cancelled

  BIG BREAKING:  పదేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ నోటిఫికేషన్‎కు సంబంధించి 2019లో టీజీపీఎస్సీ ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‎ను హైకోర్టు రద్దు చేసింది. ఓఎంఆర్ షీట్స్ రీవాల్యూయేషన్ చేసి, మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది హైకోర్టు. ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించే పార్ట్‌–బీలో ట్యాంపరింగ్‌ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2015లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016 నవంబర్‎లో రాత పరీక్షలు నిర్వహించి.. 2019లో గ్రూప్-2 నియమాకాలు చేపట్టింది టీజీపీఎస్సీ. అయితే.. 2015 గ్రూపు-2 ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్‌ జరిగిందని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు 2025, నవంబర్ 18న తుది తీర్పు వెలువరించింది. 

ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను కోర్టు  తప్పుబట్టింది. డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్‌ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పరిధి దాటి వ్యవహరించిందని చురకలంటించింది. 

వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా జవాబు పత్రాలను మూల్యంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం  ఓఎమ్ఆర్ షీట్లను రీవాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది. 


కాగా, గ్రూప్‌–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు.అయితే ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్‌ షీట్లకు పొంతనలేవన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్‌ నంబర్, ఓఎంఆర్‌ నంబర్‌ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో తన నివేదిక సమర్పించింది. పార్ట్‌–బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్‌నర్‌ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని కమిటీ సిఫారసు చేసింది. 

కమిటీ సిఫారసులపై కొందరు సింగిల్‌ జడ్జి, తర్వాత ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించగా దీనిపై సాంకేతిక కమిటీ సిఫారసులను పాటించాల్సిందేనని ద్వి సభ్య ధర్మాసనం 2019లో తీర్పు చెప్పింది. అయినా అందుకు విరుద్ధంగా పత్రాలను మూల్యాంకనం చేశారంటూ సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలం చెన్నాయపాలెంకు చెందిన భూక్యా ప్రియాంకతోపాటు మరికొందరు హైకోర్టులో 2019లో  మరో ఆరు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక మంగళవారం తీర్పు వెలువరించారు.  

Advertisment
తాజా కథనాలు