/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజనతో పాటుగా రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే పథకాలను రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ రెండు పథకాలని ఆన్ లైన్ దరఖాస్తుల కోసం పోర్టల్ ను కూడా మంత్రి లాంఛ్ చేశారు. ఈ పథకాలకు రేవంత్ సర్కార్ రూ.30 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
రూ. 50వేల ఆర్థిక సాయం
ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, అవివాహిత, ఒంటరి, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ. 50వేల ఆర్థిక సాయం చేయనున్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుంది. ఇక రేవంతన్న కా సహారా – మిస్కీన్ కేలియే పథకం కింద ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనం కొనుగోలుకి లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
2025 అక్టోబరు 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులు తీసుకోరు. ఈ పథకాల వలన మైనారిటీల స్థిరమైన అభివృద్ధికి పునాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక మైనారిటీ విద్యార్థుల కోసం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.