/rtv/media/media_files/2025/08/04/revanth-vs-ram-chander-rao-2025-08-04-19-45-00.jpg)
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బలోపేతం కావడమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. స్థానిక ఎంపీ డీకే అరుణ ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన బాటలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా వీరు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్ని జనార్దన్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా త్వరలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పన్నట్లు తెలుస్తోంది. వీరంతా బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయడంతో పాటు రాష్ట్రంలో మళ్లీ చేరికలకు ఊపు తేవడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో భాగంగా గువ్వల బాలరాజు, అబ్రహం రెండు రోజుల క్రితం బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ను కలిసినట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు ఇటీవల జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించినట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో చేరికల విషయాన్ని హైకమాండ్ కు వివరించేందుకే ఎంపీ డీకే అరుణ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఖండించారు. కావాలని కొంత మంది పనిగట్టుకుని తనపై దృష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తన చివరి శ్వాస వరకు కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
పాలమూరుపై బీజేపీ స్పెషల్ ఫోకస్..
గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణను బీజేపీ బరిలో దించింది. ఏఐసీసీ స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న వంశీచంద్ రెడ్డిని హస్తం పార్టీ బరిలోకి దించింది. సొంత సీటు కావడంతో సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహించారు. అయితే.. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అనూహ్య విజయం సాధించి రేవంత్ కు షాకిచ్చారు. సొంత సీటులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఎంపీగా గెలిచిన డీకే అరుణ పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిపించడమే లక్ష్యంగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు.