/rtv/media/media_files/2025/08/08/brother-2025-08-08-07-11-18.jpg)
విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ అక్క. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పందిరి పెద్ద లింగారెడ్డి, శారద దంపతులకు జ్యోతి, అప్పిరెడ్డి(24) అనే ఇద్దరు సంతానం. అప్పిరెడ్డి పుట్టిన కొన్ని రోజులకే శారద కన్నుమూసింది. చిన్ననాడే అమ్మ దూరమైనా ఇద్దరు పిల్లల్ని పెద్ద లింగారెడ్డి అల్లారుముద్దుగా పెంచాడు. ఇద్దర్ని పెంచి పెద్దచేశాడు. శారదకు పెళ్లి చేయగా.. అప్పిరెడ్డి జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
అయితే అప్పిరెడ్డి రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మరో రెండు రోజుల్లో రాఖీ పండగ ఉన్న నేపథ్యంలో అక్క జ్యోతితోపాటు వరసకు సోదరీమణులయ్యే మరో 30 మంది కన్నీటి పర్యంతమవుతూ చితిపైన ఉన్న అప్పిరెడ్డి మృతదేహానికి రాఖీలు కడుతూ గుండెలవిసేలా విలపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారిని కలిచివేశాయి. స్థానికంగా ఘటన అందర్నీ కన్నీటిపర్యంతం చేసింది.