Pawan Kalyan : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌..ఆ పార్టీ కోసం ప్రచారం

రాఫ్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఈ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది.

New Update
FotoJet - 2026-02-04T092259.302

Pawan Kalyan campaigning for BJP

Pawan Kalyan : రాఫ్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఈ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వీలయినంత ఎక్కువ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా ఈనెల 7,8 తేదీల్లో తెలంగాణలో బీజేపీకి మద్దతుగా పవన్‌ ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి, రామచందర్ రావు.. పవన్‌ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.


 
కాగా పవన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రామచందర్ రావు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నా. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా, అర్థవంతమైన చర్చలు జరిపాము. పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించారు’ అని తెలపడం గమనార్హం. కాగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో టీడీపీ, జనసేన పోటీలో చేయడం లేదు. బీజేపీ మాత్రమే ఎన్నికల్లో తలపడుతోంది. ఈ క్రమంలో తమ మిత్రపక్షం తరుపున పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.

కాగా, రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. 13న ఫలితాలు వెలువడుతాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  

Advertisment
తాజా కథనాలు