Operation kagar: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20 మంది కీలక నేతలను అరెస్టు చేయగా మరో 8 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లో లొంగిపోయిన వారి ఆకౌంట్లో రివార్డు డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మిగతా మావోయిస్టులంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
పోరు కన్నా ఊరు మిన్న..
మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ములుగు జిల్లాలో పలువురిని అరెస్ట్ చేయగా కొంతమంది లొంగిపోయినట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. వివిధ హోదాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారని, తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారని అన్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరుకి తిరిగు రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారీ ఆకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్సీ శబరిష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాల ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు.
ములుగు యువకుడు మృతి..
తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ను ములుగు జిల్లా ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి నీరజ్గా గుర్తించారు. ఈ మేరకు అక్కడి పోలీసులు మృతుడి అన్న రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజు గురువారం చత్తీస్గఢ్ వెళ్లి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చనిపోయింది తన తమ్ముడు నీరజ్ అని నిర్ధారించడంతో మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో నీరజ్ అలియాస్ రవి డెడ్బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చిన అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏటూరుకు చెందిన సాధనపల్లి అన్నపూర్ణ వెంకటేశ్వర్లు దంపతుల రెండో కుమారుడైన నీరజ్ ఏటూరునాగారంలో ఇంటర్ వరకు చదివాడు. తర్వాత భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ 2023 సెప్టెంబర్లో మావోయిస్ట్ పార్టీలో చేరాడు. అప్పటినుంచి బెటాలియన్ డాక్టర్ టీం కమాండర్గా, దామోదర్కు రైట్ హ్యాండ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతడిపై 8 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. స్వగ్రామంలో జరిగిన నీరజ్ అంత్యక్రియలకు స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
కర్రెగుట్టల్లో తుపాకుల గర్జన..
దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన కార్యాచరణే ఆపరేషన్ కగార్. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్రప్రభుత్వం ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు సంచలనంగా మారాయి. ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు కాల్పుల మోతతో హోరెత్తగా.. తాజాగా భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ తుపాకుల గర్జన వినిపించింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను వేగవంతం చేస్తూ.. వేల మంది పోలీసు, కేంద్ర బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తున్నది. తెలంగాణలోని ములుగు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లోని ఎత్తయిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజులపాటు ఆపరేషన్ కగార్ను నిర్వహించారు.
చర్చల ఊసెత్తని కేంద్రం..
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఏప్రిల్ 21న ‘ఆపరేషన్ బ్లాక్ఫారెస్ట్ (కర్రెగుట్టలు)’ ప్రారంభమైంది. మూడు వారాల్లో 28 సార్లు ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, 18 మంది జవాన్లకు గాయాలైనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. చర్చలకు కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధంగా ఉందో, లేదో? స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ ద్వారా ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు, అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే విపక్షాలు, ప్రజల నుంచి ఆపరేషన్ కగార్పై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.