/rtv/media/media_files/2025/10/20/four-lakh-bribe-in-drunk-and-drive-case-2025-10-20-21-46-09.jpg)
Four lakh bribe in drunk and drive case
CRIME:వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ చేసిన ఇంటెలిజెన్స్ పోలీసులు నిజమేనని తేల్చినట్లు ప్రచారం సాగుతోంది. సదరు ఎమ్మెల్యే కొడుకు గతంలో పోలీస్ శాఖలో పనిచేసినట్లు తెలుస్తోంది.
రూ.4 లక్షల లంచం తీసుకొని.. డ్రంక్అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2025
వరంగల్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యే కొడుకుగా ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలో వెల్లడి
గతంలో పోలీసు శాఖలో పనిచేసిన సదరు ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం
హనుమకొండలో మద్యం… pic.twitter.com/LeaudBRWoo
వివరాల ప్రకారం.. హనుమకొండలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఎస్సై వారం రోజుల క్రితం వాహనాలు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో మద్యం సేవించి కారులో వెళ్తున్న ఐనవోలు మండలానికి చెందిన ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. దీంతో వారిని ఎస్సై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫోన్ చేసి కారు డ్రైవింగ్ చేసిన యువకుడిని వదిలిపెట్టాలని కోరాడు. ఎమ్మెల్యే కొడుకు చెప్పడంతో అతడిని వదిలేశారు. అయితే పక్క సీటులో కూర్చున్న యువకుడిని మాత్రం ఎస్సై రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి చిత్ర హింసలకు గురి చేసినట్లు తెలిసింది. చివరికి అతన్ని బెదిరించి లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
చేసేది లేక బాధిత యువకుడు బంగారు గొలుసు తాకట్టు పెట్టి పోలీస్ స్టేషన్లో రూ.లక్ష ఇచ్చి బయటకొచ్చాడు. అయితే అంతటితో ఊర్కోకుండా మరోసారి బాధితుడి వద్ద 8 గ్రాముల గంజాయి దొరికినట్లుగా ఎస్సై కేసు నమోదు చేశాడు. పోలీసుల దెబ్బలతో బాధితుడి ఆరోగ్యం దెబ్బతినడంతో అతన్ని చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిసింది. దీనిపై బాధిత కుటుంబం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న యువకుడిని పోలీసులు కొట్టడం, రూ.లక్ష వసూలు చేసి గంజాయి కేసు పెట్టడం నిజమేనని వారి విచారణలో తేల్చారు. మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిపై కేసు కాకుండా చూసేందుకు రూ.4 లక్షలు లంచం తీసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు తప్పించాడని గుర్తించారు. దీంతో సదరు వ్యక్తితో పాటు ఎస్సైపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?