/rtv/media/media_files/2025/02/04/o11V94ot2jemC9jhSC7x.webp)
Hyderabad Ministers Quarters
Ministers Quarters : హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమ సమస్యలను పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు మినిస్టర్స్ క్వార్టర్లను ముట్టడించారు. ఒక్కసారిగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన వీఆర్ఏలు మినిస్టర్ క్వార్టర్స్ను చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతత చోటు చేసుకుంది.పోలీసులు వారిని అడ్డుకోవడంతో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వీఆర్ఏలను మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీఆర్ఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
ఇది కూడా చదవండి: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు
61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, 81, 85 జీవోల ప్రకారం వారసులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని పలు డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. అంతేగాక 3797 మంది వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోకపోగా.. తమ గోడు వెల్లబోసుకునేందుకు మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. జీవో ఇచ్చి 15 నెలలు గడుస్తున్న తమను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ తో వీఆర్ఏ జేఏసీ ఆద్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు.
Also Read: America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
గత ప్రభుత్వంలో వీఆర్ఏల దీర్ఘకాలిక పోరాటం తర్వాత వీఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపి ప్రభుత్వం 81, 85 జీవోలను విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20, 555 మంది వీఆర్ఏల్లో వారి విద్యార్హతల ప్రకారం ఆయా శాఖల్లో 16, 758 మందిని ప్రభుత్వం సర్ధుబాటు చేసిందని, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా కాలయాపన చేసిందని వివరించారు. ఉద్యోగం రాక వీఆర్ఏల వారసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఒత్తిడితో 265 మంది మరణించారని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని వాపోయారు. ఇక ఖాళీగా ఉన్న 3,797 మంది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి, ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కాగా పలువురు వీఆర్ఏలు బారికేడ్లను తోచుకొని ముందుకు పరుగులు తీశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయిన వీఆర్ఏలు వెనక్కి తగ్గలేదు. సుమారు గంటసేపు పోలీసులు వీఆర్ఏల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. చివరికి కొంతమంది వీఆర్ఏలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడంతో ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది.