/rtv/media/media_files/2024/11/21/UDDhzPi6oLbHTatFO8go.jpg)
MLC Kavitha
MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ నాయకుల విషయంలో కోపంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎక్కడ వదలుకోవడం లేదు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే జాగృతిని మరింత బలోపేతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. జాగృతిని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా ఇటీవల యువ లీడర్లకు శిక్షణ శిభిరం సైతం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలు అసక్తికరంగా మారాయి. తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరమని కవిత చెప్పడం సంచలనంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె సమర్థించడం లేదన్న విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. అదే సమయంలో తెలంగాణ కవులను ఆకట్టుకునేందుకు దాశరథి జయంతి రోజున కవిసమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానించారు.
మరో వైపు కవితను బీఆర్ఎస్ కు దూరం చేయడానికి కేటీఆర్ పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల క్రితమే బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను పక్కకు తప్పించారు. కవిత స్థానంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో తనకు జరిగిన అవమానాన్ని కవిత తట్టుకోలేకపోతుంది.బీఆర్ఎస్లో తనకు జరుగుతున్న వరుస అవమానాలు ఎదుర్కోవడం కంటే పార్టీలో నుంచి బయటకు రావడమే బెటరనే ఆలోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె తెలంగాణ జాగృతిని మరింత విస్తృతం చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కవిత బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చి.. కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా అన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ హైకమాండ్ పార్టీలో క్యాడర్ చేజారి పోకుండా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.బీఆర్ఎస్ యూత్ చేజారిపోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ కూడా వరుస కార్యక్రమాలు చేపడుతోంది. జాగృతి కార్యక్రమానికి పోటీగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం కల్వకుంట్ల కవిత జాగృతి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారు. అందుకే ఆమె యువ నాయకత్వంపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరం అంటూ కవిత చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణ జాగృతి 19 ఏళ్లుగా తెలంగాణ కోసం పనిచేస్తోందని చెప్పారు. అదే సమయంలో కవిత కొత్త నాయకత్వం అని ప్రస్తావించడంపై రకరకాల చర్చ నడుస్తోంది. ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సమర్థించడం లేదా..! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్లో నుంచి కవిత బయటకు వచ్చి.. కొత్త పార్టీ పెడుతారన్న టాక్ వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అంత ఈజీ కాదన్న విషయం ఆమెకు కూడా తెలుసు.
ఇదిలా ఉండగానే ప్రస్తుతం కల్వకుంట్ల కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సింగరేణిలో బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కవిత గత పదేళ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఆమెను తప్పించి మాజీ మంత్రి, మాజీ సింగరేణి కార్మికుడు అయిన కొప్పుల ఈశ్వర్కు యూనియన్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కవిత బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. తను అధికారికంగా టీబీజీకేఎస్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అదే తరుణంలో సింగరేణిలో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్తో జత కట్టేందుకు కవిత సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు హెచ్ఎంఎస్ నాయకులతో కవిత భేటీ కానున్నారు.
నాడు నాయిని..నేడు కవిత
హిందూ మజ్ధూర్ సభ (హెచ్ఎంఎస్) కార్మిక సంఘం సింగరేణిలో జాతీయ కార్మిక సంఘంగా ఉంది. గతంలో సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో రెండు, మూడు డివిజన్లలోనూ విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ తో కలిసి పనిచేసింది. ఈ సంఘానికి మాజీమంత్రి నాయిని నరసింహరెడ్డి దశాబ్ధాల పాటు అధ్యక్షులుగా కొనసాగారు. రియాజ్ ఆహ్మద్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్కు అనుబంధంగా టీబీజీకేఎస్ ఉన్నప్పటికీ నాయిని హెచ్ఎంఎస్ కు నాయకత్వం వహించడం విశేషం. అయితే ఆ సంఘం ఏ పార్టీకి అనుబంధంగా లేని కారణంగా నాడు బీఆర్ఎస్ పై అంతగా ప్రభావం పడలేదు. అయితే ఆ తర్వాత యూనియన్ లో వచ్చిన విబేధాల నేపథ్యంలో నాయినిని ఆ సంఘం పక్కన పెట్టినట్లు ప్రకటించింది. ఇక జాతీయ కార్మిక సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్ పలు కేంద్ర, రాష్ర్ట పరిశ్రమాల్లోనూ పట్టు కలిగి ఉంది. ఆ యూనియన్కు జాతీయ స్థాయిలో నాయకత్వం ఉన్నప్పటికీ సింగరేణిలో మాత్రం కొంత స్వతంత్ర సంఘంగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కవిత ఆ సంఘంతో బేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ యూనియన్ నాయకులు కవితను తమ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సింగరేణిలో టీబీజీకేఎస్కు ప్రత్యామ్నయంగా హెచ్ఎంఎస్ను బలోపేతం చేసి బీఆర్ఎస్కు కవిత సవాలు విసిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay : బండి సంజయ్కి 48 గంటల డెడ్లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్