కేసీఆర్ సేఫేనా?.. మంత్రి వ్యాఖ్యలతో అనేక అనుమానాలు!

TG: కేసీఆర్‌ను ఏం చేశారో అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎలా ఉన్నారనే చర్చ రాష్ట్ర ప్రజల్లో మొదలైంది.

New Update
KCRS

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఏమైంది..? ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా..? లేదా బాగానే ఉన్నారా..? ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ కనిపించట్లేదని.. అసలు ఆయన బానే ఉన్నారా.. బాగుంటే బయటకు రావాలి కదా.. అంటూ ఇటీవల కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు గజ్వేల్‌లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పదవీకాంక్షతో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. కేసీఆర్‌ను ఏం చేశారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌.. కేసీఆర్‌ను గొంతు(బొండిగె) పిసికి చంపేసిండేమో.. నెత్తి పగలకొట్టి ఏమైనా చేశాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కనిపించకపోవడం వల్లే అనుమానపడాల్సి వస్తోందని కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ అప్పుడెప్పుడో అసెంబ్లీకి వచ్చారని.. మళ్లీ ఇప్పటిదాకా రాలేదంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కనపడటం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. 

కేసీఆర్‌ ఫొటోలు షేర్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌..

అయితే కాంగ్రెస్‌ నేతలు, మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ పార్టీ అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో.. ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించుకుని వ్యాఖ్యానించాలని హెచ్చరించారు. కేసీఆర్‌ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఆయన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు. 

బుధవారం నాడు సతీమణి శోభ పుట్టిన రోజు వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొన్నారని.. ఆమెకు కేక్‌ తినిపించారని.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేశారు.  కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. కాంగ్రెస్ నేతలు కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారం వచ్చినా తమ అధినేత కుటుంబాన్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి.. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా తమ అధినేతపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ చాలా ఆరోగ్యంగా ఉన్నారని.. పార్టీ నాయకులతో భేటీ అవుతూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మల్లారెడ్డి మనవరాలు పెళ్ళికి...

తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. తన మనువరాలు శ్రేయ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. పెళ్ళికి రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మల్లారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫొటోలో కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు