/rtv/media/media_files/2025/07/04/mallikarjun-kharge-modi-2025-07-04-17-39-35.jpg)
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయన్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ తెలంగాణకు 11ఏళ్లలో ఏమీ ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమర భేరి సభలో ఖర్గే పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని తెలిపారు. రాష్ట్రంలో గెలుపు కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు. సీఎం రేవంత్, భట్టి, మంత్రులు కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేశారని కొనియాడారు. కేసీఆర్, బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకున్నాయని కానీ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు.
తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ అని ఖర్గే తెలిపారు. పేదలకు సన్నబియ్యం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా కాంగ్రెస్ ఏం చెప్పిందో అది తప్పకుండా చేసిందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు కొట్లాడుతామని ఖర్గే తెలిపారు. మోదీ, అమిత్ షా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ వాళ్లు దేశానికి, తెలంగాణకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనే దేశం చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు.
ఇందిరా బెదరలేదు
పాకిస్తాన్ ను ఏమో చేశామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు, యుద్ధాన్ని ఎందుకు ఆపారో చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. అమెరికా యుద్ద నౌకల్ని పంపినా ఇందిరా బెదరలేదన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేశారని, మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. 42 దేశాల్లో పర్యటించిన మోదీ.. ఇండియాలోని మణిపూర్ లో ఎందుకు పర్యటించడం లేదని నిలదీశారు. బీహార్ ఎన్నికల మీదున్న శ్రద్ధ దేశ భద్రత మీద లేదన్నారు. దేశం కోసం కాంగ్రెస్ లో చాలామంది ప్రాణాలు ఇచ్చారని, అలాంటివాళ్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఉన్నారా అని ఖర్గే సవాల్ చేశారు. దమ్ముంటే సెక్యూలర్, సోషలిస్ట్ పదాలను తీసేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.