/rtv/media/media_files/2025/08/12/hyd-gangwar-2025-08-12-13-28-46.jpg)
HYD Gangwar
HYD Gangwar: హైదరాబాద్లో గ్యాంగ్వార్లు అరుదైనప్పటికీ.. అప్పుడప్పుడు ఇవి నగర భద్రతకు సవాలుగా నిలుస్తాయి. ఈ సంఘటనలు భూ వివాదాలు, పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల వల్ల ఎక్కువగా జరుగుతాయి. ఇటీవల కాలంలో.. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో.. యువకులను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ గ్యాంగ్లు చిన్నపాటి ఘర్షణల నుంచి తీవ్రమైన దాడుల వరకు వెళ్తున్నారు. ఈ గొడవల వల్ల సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఈ గ్యాంగ్లను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారిపై నిఘా పెడుతూ.. యువతను ఈ మార్గంలో వెళ్లకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా గ్యాంగ్వార్ల నివారణకు సామాజిక అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా ఈ గ్యాంగ్వార్లు తగ్గటం లేదు. ఇప్పుడు తాజాగా భాగ్యనగర్లో గ్యాంగ్వార్ కలకలం రేపింది.
చిన్న చిన్న గొడవలు గ్యాంగ్వార్కు..
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్వార్ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటూ.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. అవినాష్ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాదాపు 15 మంది విద్యార్థులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. గ్యాంగ్వార్కు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. వ్యక్తిగత వివాదాలు లేదా చిన్న చిన్న గొడవలు గ్యాంగ్వార్కు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా.. దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లలో పాల్గొన్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని.. విచారించనున్నారు.
సీసీటీవీ ఫుటేజ్.. అవినాష్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
హైదరాబాద్ - ఎల్బీనగర్లో నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విద్యార్థులు
ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ దాడి
మొత్తం 15మందిపై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు pic.twitter.com/Czt6px20ly
ఈ ఘటనతో ఎల్బీనగర్లో భయాందోళన నెలకొంది. విద్యార్థులు ఇలా బహిరంగంగా దాడులు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా. కాలేజీ యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులు ఎందుకు కొట్టుకున్నారన్న దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. వారిని కౌన్సిలింగ్ చేయాలి.. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీలో గొడవలు పరిష్కరించుకోలేక.. రోడ్డుపైకి వచ్చి దాడులు చేసుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో కాల్పులు.. ఆ ఏరియాలో హైటెన్షన్!