/rtv/media/media_files/2025/10/20/health-atms-2025-10-20-15-51-03.jpg)
Health ATMs
TG News: గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రి, మలక్పేట ఏరియా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఈ హెల్త్ ఏటీఎంలను అభివృద్ధి చేసింది. గత రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన వీటి సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్న్నీ పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు లేవు. ప్రస్తుతం రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి, జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి, రోగ నిర్ధారణ అవ్వడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి వస్తంది. కానీ సరైన అవకాశలు లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందడం ఆలస్యం అవుతోంది.ఈ క్రమంలో త్వరితగతిన ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఏంలపై సర్కారు దృష్టిసారించింది.
ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయని చెబుతున్నారు. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు (బీపీ), బరువు, ఎత్తు, బీఎంఐ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి అన్నింటిని తక్షణమే కొలుస్తాయి. అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలైన రక్తంలో గ్లూకోజ్ (షుగర్), ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ టెస్టులతో పాటు, డెంగ్యూ, మలేరియా, హెచ్ఐవీ వంటి వ్యాధులకు సంబంధించిన రాపిడ్ టెస్టులు కూడా వెంటనే చేస్తాయి. మొత్తంగా132 రకాల పరీక్షల ఫలితాలను నిమిషాల్లోనే అందిస్తాయి. రోగి ఆరోగ్య రికార్డు డిజిటల్గా తయారై, సురక్షితంగా నిల్వ చేయడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఆన్లైన్లో ఎప్పుడైనా వారి ఆరోగ్య వివరాలను పొందడానికి వీలు కలుగుతుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే, రోగి ఈ యంత్రం ద్వారానే వైద్యుడు ఎక్కడ ఉన్నా అతడితో వర్చువల్గా మాట్లాడవచ్చు. మిషన్ సేకరించిన ఆరోగ్య డేటా మొత్తం డాక్టర్కు చేరుతుంది. దీని ఆధారంగా డాక్టర్ సలహాలు, చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది.
ప్రయోగాత్మకంగా పరీక్షించి..
కాగా కింగ్కోఠీ, మలక్పేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం ద్వారా రోజుకు 20-25 మంది రోగులకు పరీక్షలు చేశారు. అదే రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి, నారాయణగూడలోని టీ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపి, అక్కడ మరోసారి పరీక్షలు చేశారు. హెల్త్ ఏటీఏం ద్వారా వచ్చిన టెస్టు ఫలితాలను, టీ డయాగ్నస్టిక్ ల్యాబ్లో చేసిన పరీక్షల ఫలితాలను పోల్చి చూశారు. రెండు నివేదికలు ఒకేలా వచ్చాయి. అంతేకాక కొన్ని నమూనాలను ప్రైవేటు ల్యాబ్లకు కూడా పంపి మరోసారి పరీక్షించారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను హెల్త్ ఏటీఎం ఇచ్చిన టెస్టు రిపోర్టులతో పోల్చి చూసినా అదే ఫలితం వచ్చింది. దీంతో హెల్త్ ఏటీఏంలు ఇచ్చే ఫలితాలు చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయని వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించింది.
ఇతర రాష్ట్రాల్లో విజయవంతం
కాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఉన్న పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో సెల్ప్ ఆపరేటెడ్ కియోస్కిలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిస్తోంది. అలాగే ప్రస్తుతం తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టు కింద సేవలందిస్తోన్న ఢిల్లీ సంస్థనే ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి సేవలందిస్తుందని తెలిసింది. అయితే అక్కడ ఈ హెల్త్ ఏటీఎం సేవలు ఎలా ఉన్నాయి? వాటిని ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు? తదితర విషయాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో హెల్త్ ఏటీఎంలపై సమీక్ష కూడా నిర్వహించారు. ముందుగా వీటిని ఏర్పాటు చేసిన ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని మంత్రి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడంపై మళ్లీ ఒక కమిటీని వేయనున్నారు. ఆ కమిటీ నివేదిక అనంతరం వీటిని కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!
Follow Us