/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగా జలవివాదాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ‘నీళ్లు-నిజాలు’ అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ సంతకం - తెలంగాణకు అన్యాయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల కేటాయింపులు ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి సంతకం చేశారని రేవంత్ గుర్తుచేశారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్కు 66 శాతం వాటా దక్కగా, తెలంగాణకు కేవలం 34 శాతమే మిగిలిందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. నదీ పరివాహక ప్రాంతం ప్రకారం చూస్తే తెలంగాణకు కృష్ణా జలాల్లో 71 శాతం వాటా రావాలని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ మనుగడ కోసమే వివాదాలు
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస పరాజయాలతో బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్ గ్రహించారని, అందుకే మళ్లీ జలవివాదాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అపోహలు సృష్టించేందుకు ఒక "అబద్ధాల సంఘాన్ని" ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
అవగాహన సదస్సు - పవర్ పాయింట్ ప్రజంటేషన్
అంతకుముందు, నీటి వాటాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘నీళ్లు-నిజాలు’ అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను వివరించారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, ఆ హక్కులను కాపాడటంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Follow Us