/rtv/media/media_files/2025/07/04/cm-revanth-kcr-2025-07-04-18-48-29.jpg)
తెలంగాణలో తమకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని, సంక్షేమ పథకాలు అమలు చేయరని, కలిసి ఉండరని చాలా మంది ప్రచారం చేశారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన పాల్గొన్నారు.
18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులని చేశామన్నారు సీఎం రేవంత్. దేశంలోనే అత్యధిక వరి పండించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని తెలిపారు. రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ ప్రతిపక్షాలకు సీఎం సవాల్ విసిరారు.
సన్నాసులు విమర్శలు చేస్తున్నారు
పేదలకు రూ. 5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే. కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారని అలాంటి వాళ్లను బట్టలిప్పి కొడితే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందన్నారు. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమమని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాం.. ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేదికగా కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నానని.. లెక్కలో ఒకటి తగ్గిన క్షమాపణలు చెబుతానని తెలిపారు. 18 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా మన విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాళికలు వేసుకున్నామన్నారు సీఎం.