/rtv/media/media_files/2025/10/14/case-filed-against-brs-mla-candidate-maganti-sunitha-and-daughter-2025-10-14-10-58-48.jpg)
Case filed against BRS MLA candidate Maganti Sunitha and daughter
Big breaking : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షర, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదైంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరతో పాటు కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, బీఆర్ఎస్ నేతలు ఆజం అలీ, అంజద్ అలీఖాన్, ఫయీం, షఫీ తదితరులతో పాటు మరికొంతమంది పార్టీ కండువాలు వేసుకుని వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కరపత్రాలతో కనిపించారు.
విషయం తెలిసిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు, ఇతర నేతలు చేతుల్లో కార్డులు పట్టుకొని ప్రార్థనలు చేసి వస్తున్న వారిని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని, మతపరమైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు చేయకూడదని ఆయన అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారి ఫ్రాన్సిస్ వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మసీదు వద్దకు వెళ్లి ప్రచారం చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు చేశారు. వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని A1గా మాగంటి సునీతను, A2గా మాగంటి అక్షరతో పాటు మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేశారు.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!