/rtv/media/media_files/2026/01/21/bjp-in-telangana-2026-01-21-21-26-40.jpg)
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఆయన తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. బీజేపీ కొత్త బాస్ నితిన్ నబీన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్పీడ్అప్ చేశారు. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ సమీకరణాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు.
ఎన్నిక ఏదైనా సీరియస్గా తీసుకోవాలి: "ఏ ఎన్నికలను కూడా తక్కువగా అంచనా వేయవద్దు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ప్రతిచోటా బీజేపీ జెండా ఎగరడమే మన లక్ష్యం కావాలి" అని ఆయన లీడర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గెలుపు లక్ష్యంగా నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.
నైని బ్లాక్ వివాదంపై ఆరా
తెలంగాణలో ప్రస్తుతం దుమారం రేపుతున్న సింగరేణి - నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దు, అవినీతి ఆరోపణల అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ వివాదంపై నితిన్ నబీన్ ఆసక్తి చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'సైట్ విజిట్' పాలసీతో జరిగిన అవకతవకలు, దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కిషన్ రెడ్డి చేస్తున్న పోరాట వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఈ స్కామ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న 'లోపాయికారీ ఒప్పందాలను' ఎండగట్టాలని ఆయన నేతలకు సూచించారు. నితిన్ నబీన్ తాజా ఆదేశాలతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Follow Us