/rtv/media/media_files/2026/01/21/jeevan-reddy-2026-01-21-21-51-19.jpg)
jeevan reddy
Jagtial Municipality : జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి మరోసారి చుక్కెదురైంది. ఆయన ప్రతిపాదనలను పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆయన వర్గానికే చైర్ పర్సన్ అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పార్టీ పక్కన పెట్టడంపై జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, జిల్లా రాజకీయాల్లో వర్గపోరు ముదిరిన విషయం తెలిసిందే.
తాజాగా, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. వాణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన అనుచరురాలు కావడం గమనార్హం. దీంతో జీవన్ రెడ్డి వర్గానికి పెద్ద షాక్గా ఇచ్చినట్లయింది. గత కొంతకాలంగా మున్సిపల్ పీఠంపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న జీవన్ రెడ్డికి ఈ పరిణామం మింగుడు పడని అంశమనే చెప్పాలి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడంపై పాత కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో మరోసారి సంజయ్ కు పెద్దపీట వేయడం సంచలనంగా మారింది.
మరోవైపు జగిత్యాలలో 40 వార్డుల్లో గెలవాల్సిన చోట 20-22 సీట్లకే పరిమితం కావడానికి సంజయ్ అంతర్గత కుట్రలే కారణమని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చైర్పర్సన్ పదవి కూడా ప్రత్యర్థి వర్గానికే దక్కడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తిగా మారింది.
Follow Us