AE: నీటిపారుదల శాఖ ఏఈ నిఖేశ్ కుమార్ అవినీతిలో మరిన్ని సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే అక్రమ సంపాదనకు అలవాటైన నిఖేశ్.. రోజుకు రూ.2లక్షలపైగా సంపాదించినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడంలో నిఖేశ్ బినామీగా కూడా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నీటిపారుదల శాఖలో 2013లో చేరిన నిఖేశ్కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పనిచేస్తూ వసూళ్లకు పాల్పడ్డట్లు తెలిపారు. సన్నిహితుల ఇళ్లలోనూ అక్రమాస్తులు.. ఇక సన్నిహితుల ఇళ్లలోనూ రూ.17.73 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కాగా ఒక లాకర్లో కిలోన్నర బంగారు ఆభరణాలు లభించడం సంచలనం రేపింది. మొత్తంగా నిఖేష్ ఆస్తి రూ.100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఉద్యోగంలో చేరిన పదేళ్లలోనే వంద కోట్లు సంపాదించడంటో పలువురు ప్రముఖ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు రూ.2లక్షలకు తక్కువ కాకుండానే ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి.. ఫొటోలు వైరల్ ఇక ప్రస్తుతం గండిపేట ఏఈఈగా నిఖేశ్కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో భారీ నిర్మాణాల కోసం వారు పెద్దమొత్తంలో లంచాలు ఇచ్చారని భావిస్తోంది. ఆయా దరఖాస్తుల నేపథ్యం గురించిన వివరాలు సేకరిస్తోంది. ఇందులో ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని సమచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లోని పత్రాలను సైతం డీల్ చేసేవాడని గుర్తించారు. అతడి ద్వారా పంపిన పేపర్ వెనక్కి వచ్చేదే కాదని, ఉన్నతాధికారులను ఒప్పించడంలో నిఖేశ్ కు తిరుగులేదని నిర్ధారించారు. పలు సమస్యలను క్లియర్ చేసేందుకు రూ.50 లక్షల వరకూ వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచినట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటల పరిధిలోని బఫర్, ఎఫ్టీఎల్ల్లో నిర్మాణాల అనుమతులను నిఖేశ్ సులభంగా ఇప్పించినట్లు వెలుగులోకి వచ్చింది.