Uttam Kumar Reddy: మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది

సీఎం కేసీఆర్‌పై ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయలేదని కేసీఆర్‌ అనడం సిగ్గుచేటని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నామని ఎంపీ ప్రకటించారు.

New Update
Uttam Kumar Reddy: మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది

మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి దంపతులు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి దంపతులు.. దేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని వారు ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనడం సిగ్గు చేటన్నారు.

మరోవైపు గత 5 ఏళ్లుగా అవినీతికి పాల్పడుతున్న వారికే కేసీఆర్‌ మళ్లీ టికెట్లు ఇచ్చారన్న ఉత్తమ్‌.. కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేల దోపిడీల గురించి ప్రజలకు తెలుసన్నారు. వాళ్లు ఓట్ల కోసం ప్రజల మధ్యకు వెళ్తే.. ఓటర్లు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను, తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నామని ఎంపీ ప్రకటించారు. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాల్లోని అన్ని నియోజవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని నల్గొండ ఎంపీ జోస్యం చెప్పారు.

సూర్యాపేటలో కేసీఆర్‌ ఏమన్నారంటే..!

50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంతానికి ఏం చేసిందని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ అభివృద్ధిలో తెలంగాణనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇచ్చామన్నారు. తలసరి ఆదాయంలోనూ మనమే నెంబర్ వన్‌లో ఉన్నామని.. సూర్యాపేటలో అద్భుతమైన కళాభారతిని నిర్మిస్తామని హామి ఇచ్చారు కేసీఆర్. సీఎం నిధి నుంచి గ్రామ పంచాయతీలకు పది లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. 25 కోట్లతో సూర్యాపేటకు కళాభారతి.. మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్‌ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్ మంజూరు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు