Telangana : తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

కనీసం 120 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాలకు 40 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలిని కొనసాగించే అర్హత ఉంటుంది. అయితే కేంద్రం.. 2020లో ఆంగ్లో ఇండియన్ సీట్లు రద్దు చేయడం వల్ల తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119కి చేరాయి. దీంతో తెలంగాణకు శాసనమండలి సంక్షోభంలో పడింది.

New Update
Telangana : తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

State Council : తెలంగాణ (Telangana) శాసనమండలిని రాజ్యాంగ సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనవరిలో కేంద్రం.. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో రిజర్వు అయి ఉన్న ఆంగ్లో ఇండియన్ సీట్లను రద్దు చేసింది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 120 నుంచి 119కి తగ్గింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం.. శాసన మండలి సంఖ్య.. రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో మూడవ వంతు మించకూడదు. కనీసం 40 మంది ఎమ్మెల్సీలు ఉండాలి. 120 అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రాలకు శాసన మండలిని కలిగి ఉండే అర్హత ఉంటుంది.

Also Read: బాబు నోట ‘జై తెలంగాణ’.. హైదరాబాద్ గడ్డపై చంద్రబాబు సంచలన ప్రకటన!

2018 నుంచి 2023 వరకు తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 120గా ఉండేదని.. అయితే ఆంగ్లో ఇండియన్ సీటు రద్దు చేసిన తర్వాత 119కి చేరిందని బీఆర్‌ఎస్‌ (BRS) మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్ అన్నారు. చట్టం ప్రకారం.. అసెంబ్లీ (Assembly) లో మూడవ వంతు సీట్లు మాత్రమే శాసన మండలిలో ఉండాలి. అంతకన్నా మించి ఉండకూడదు. తెలంగాణలో ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నందు వల్ల.. ఎమ్మెల్సీల సంఖ్య 39కి చేరుతుంది. అయితే శాసన మండిలిలో కనీసం 40 స్థానాల కన్నా తక్కువగా ఉండకూడదు. దీంతో తెలంగాణలో శాసన మండలి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అయితే తాను శాసనమండలిని రాష్ట్రంలో రద్దు చేయాలని కోరడం లేదని.. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిత్వ సంక్షోభానికి ముగింపు పలకాలని కోరుతున్నానని వినోద్‌ కుమార్ పేర్కొన్నారు.

publive-image

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని.. అలాగే ఏపీలో 175 నుంచి 225కి అసెంబ్లీ సీట్లను పెంచాల్సిన అవసరం ఉందని వినోద్‌ కుమార్ అన్నారు. ఇప్పుడు టీడీపీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. శనివారం ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకున్నప్పుడు ఈ విషయం గురించి చర్చించి ఉండాల్సిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుందని మాజీ అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణరెడ్డి అన్నారు.

Also Read: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే!

1966లో పంజాబ్‌ పునర్వ్యస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చాక.. పంజాబ్‌, హర్యానా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో 1967 అనేక లీగల్ సమస్యలు వచ్చాయని.. ఆ సమయంలో సుప్రీంకోర్టు.. పార్లమెంటుకు అసెంబ్లీలో సీట్ల సంఖ్యను మార్చే హక్కు ఉంటుందని చెప్పిందని రామకృష్ణ రెడ్డి పేర్కొన్నారు. దీంతో పంజాబ్‌కు ఏకసభ్య శాసనసభ ఉన్నందున.. హర్యానాకు చెందిన కొంతమంది సభ్యులను తొలగించినట్లు చెప్పారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమే ఈ సమస్యను పరిష్కారించి.. ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని కోరారు.

ఇప్పుడెవరైనా దీనికి సంబంధించి కోర్టులో కేసు వేస్తే తెలంగాణ శాసనమండలి రద్దయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతమున్న 38 మంది ఎమ్మెల్సీల పదవులు గల్లంతయ్యే ఛాన్స్ ఉంటుంది. శాసన మండలి రద్దు కాకుండా ఉండాలంటే.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి. అలాగే మండి సభ్యుల పరిమితిలో మార్పులు చేయాలి. రాజ్యాంగం ప్రకారం వెళ్లాలంటే.. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి. ఇందుకోసం జనగణన చేయాల్సి ఉంటుంది. 2021లో జనగణన జరగాల్సి ఉన్నా.. ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. రాజ్యాంగ ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. 2031లో జనగణన జరగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల 2034 నాటికి కూడా సీట్లు పెరగడం కష్టమని చెబుతున్నారు. 2039 ఎన్నికల నాటికి సీట్ల పెంపు సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

publive-image

publive-image

Advertisment
తాజా కథనాలు