AP Politics: ఎలాగైనా గెలవాల్సిందే.. ఎన్నికల వ్యూహాలపై పీకేతో చంద్రబాబు మంతనాలు

టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐపాక్ హెడ్ ఆదివారం సమావేశమై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు దీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చర్చించడానికి మరోసారి భేటీ అయ్యే అవకాశముంది.

author-image
By Naren Kumar
AP Politics: ఎలాగైనా గెలవాల్సిందే.. ఎన్నికల వ్యూహాలపై పీకేతో చంద్రబాబు మంతనాలు
New Update

CBN - PK: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజుకో పరిణామం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. శనివారం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐపాక్ హెడ్ ఆదివారం సమావేశమై మంతనాలు జరిపారు. మొదట గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్ ను కలిసిన ప్రశాంత్ కిషోర్ అనంతరం ఆయనతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలపై కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు దీర్ఘంగా చర్చించారు. తాము నిర్వహించిన సర్వేలోని అంశాలను ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు తన అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలను  ప్రశాంత్ కిషోర్ కు వివరించారు. గెలుపే లక్ష్యంగా తాము అనుసరించబోతున్న వ్యూహాలను పీకే దృష్టికి తెచ్చారు. జనసేన,టీడీపీ పొత్తుల అంశాన్నీ వివరించారు. చంద్రబాబుతో పాటు రాబిన్‌ శర్మ కూడా సమావేశంలో పాల్గొనడం గమనార్హం.

ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలి:

రాష్ట్రంలోని యువత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పీకే తన నివేదికలో పేర్కొన్నారు. ధరలు, కరెంటు చార్జీలు, పన్నుల పెంపు, నిరుద్యోగం ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతికూల అంశాలని, అవి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, బీసీలపై దాడులు, కేసులతో ఆ వర్గంలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకరిద్దరు మినహా మంత్రులపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను సరిగ్గా ఉపయోగించుకోవాలని చంద్రబాబుకు పీకే సూచించారని సమాచారం.  వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చర్చించడానికి మరోసారి భేటీ అయ్యే అవకాశముంది.

ఇది కూడా చదవండి: ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ తో టీడీపీకి ప్రయోజనం సున్నా: అంబటి ఫైర్

రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహకర్తలను నియమించుకుని ఈసారి ఎన్నికల బరిలో దిగుతుండడం గమనార్హం. వైసీపీతో కలిసి పనిచేయాలని రిషి రాజ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా; షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరుతో టీడీపీకి రాబిన్ శర్మ టీం పొలిటికల్ స్ట్రాటజీలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కొత్త పార్టీలు ఏర్పడుతుండడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

#ap-ex-cm-chandrababu #ipac #prashant-kishor
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe