PM Modi: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!!

దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు.

New Update
PM Modi: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) శుక్రవారం ముంబై మహానగరానికి మరో కానుక ఇచ్చారు. 21.8 కిలోమీటర్ల పొడవైన అటల్ సేతు(Atal Sethu)ను  ప్రారంభించడం ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య దూరాన్ని తగ్గించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రజలు సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ల నుండి కూడా బయటపడతారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర ఈ వంతెన సముద్రంపై నిర్మించబడింది. అటల్ సేతుపై ప్రయాణించే వారు కేవలం రూ.250 టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన వంతెన. ప్రతిరోజూ దాదాపు 70 వేల మంది ప్రయాణికులు ఈ బ్రిడ్జి గుండా ప్రయాణిస్తారని, వారి సమయం, ఇంధన వ్యయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి 2006లో టెండర్లు తెరవగా, 2016లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ఈ వంతెన నిర్మాణం ఏప్రిల్ 2018 లో ప్రారంభమైంది.

ప్రయాణ సమయం తక్కువ:
అటల్ సేతు 6-లేన్. ఇది భారతదేశంలోనే అతి పొడవైన వంతెన. దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన కూడా. ఇది ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయా(Mumbai International Airports)లకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ముంబై నుండి పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు, ఇది ముంబై పోర్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని కూడా మెరుగుపరుస్తుంది.

వంతెనపైకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించరు:
ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ముంబై పోలీసులు మాట్లాడుతూ ఈ సముద్ర వంతెనపై నాలుగు చక్రాల వాహనాలైన కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు, మినీ బస్సులు, టూ-యాక్సిల్ బస్సుల వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. బ్రిడ్జి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వేగం గంటకు 40 కిలోమీటర్లకే పరిమితం కానుంది. అయితే ఈ వంతెనపైకి మోటార్ బైక్‌లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లను అనుమతించరు. దీంతో పాటు ముంబై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ భారీ వాహనాలు, ట్రక్కులు, బస్సులు ఈస్టర్న్ ఫ్రీవేలోకి ప్రవేశించడానికి వీల్లేదు.

చూపరులను ఆకట్టుకుంటున్న బ్రిడ్జి అందాలు..వైరల్ వీడియో:
అలట్ సేతు బ్రిడ్జి ప్రారంభానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై గురువారం రాత్రి మోదీ కాన్వాయ్ రిహార్సల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ సాయంతో తీసిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాత్రి పూట విద్యుల్ దీపాల వెలుగులతో బ్రిడ్జి చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది.

ఇది కూడా చదవండి: సంక్రాంతి పండుగ ఎప్పుడు 14న లేక 15న? ఏ సమయంలో జరుపుకోవాలి? పండితులు చెబుతున్నది ఇదే..!!

Advertisment
తాజా కథనాలు