ప్రతీకారాల పాలన.. సోయిలేని సమాజం !

ప్రతీకారాల పాలన, సోయి లేని సమాజంలో బతికి ఉన్న శవాలె ఎక్కువ కనిపిస్తున్నాయి! నిరుద్యోగం అర్రులు చాచి, వేరే దారి లేక, స్వార్ధపరుల, నిజమైన రాజకీయ మాఫియాల ఉచ్చులో పడి విలవిలలాడిపోతోంది. మరింత సమాచారం కోసం ఈ ఒపినియన్ ఆర్టికల్ చదవండి.

sai baba 3
New Update

ప్రతీకార పాలన - సోయిలేని సమాజం!                                   
భారత్ తో హై అజాద్!హమ్ కబ్ అజాద్ కెహలాయెంగే!( స్వతంత్రం భారతదేశం లో మనం ఎప్పుడు స్వతంత్రులం అనిపించుకుంటాం) ప్రతీకారాల, పాలన,సోయి లేని సమాజంలో బతికి ఉన్న శవాలె ఎక్కువ కనిపిస్తున్నాయి! నిరుద్యోగం అర్రులు చాచి, వేరే దారి లేక, స్వార్ధపరుల, నిజమైన రాజకీయ మాఫియాల ఉచ్చులో పడి విలవిలలాడిపోతోంది. యువత ముక్కుపచ్చలారని వయస్సులో డ్రగ్ ఎడిక్ట్‌గా మారిపోతోంది. అందుకోసం, వారిని పావులుగా ఉపయోగించుకునే వారికి 50 వేల రూపాయలకు అమ్ముడు పోయే పరిస్థితి వచ్చింది.

 కుటుంబాలలో పేదరికం,అర్ధాంతర చదువులు, ఒక వేల మంచి చదువులు చదివినా ఉద్యోగాలు లభించని పరిస్థితి. యూపీ,హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో యువత నేర సామ్రాజ్యంలోకి తప్పని పరిస్థితిలో వెళ్లి పోతున్నారు. ఒకటికి, రెండు కేసులలో ఇరుక్కుని, అందులో నుంచి బయటకు రాలేక పోతున్నారు. పదిహేడేళ్ల వయసు నుంచే వారిలా మారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. వీరికి మంచి, చెడుల సోయి ఉండదు! వీరు తమ అవసరం కోసం డబ్బు తీసుకుని చావడానికి సిద్ధం అయిపోయే వ్యక్తి గురించి తెలువదు! తెలుసుకునే అవసరం తమకు లేదు,తాము డబ్బులు తీసుకున్నాము కాబట్టి అతను ఎవరు అయితే తమకేంటి? అనే పరిస్థితి ఉంది. 

ముంబైలో అక్కడి మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య ఒక్కటి చాలు, ఎలా కేవలం మనిషికి 50 వేల రూపాయలు తీసుకుని, ఏమాత్రం సోయి లేకుండా ప్రజల మనిషిని చంపేశారు. సమాజానికి సిద్ధిఖీ హత్య వల్ల ఎంత నష్టమో చంపిన వాళ్లకు తెలియదు. ఒక కరుడుగట్టిన క్రిమినల్ జైల్లో ఉండి ఈ హత్యకు ప్లాన్ వేస్తాడు. సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిమీద కాల్పులు జరుగుతాయి. సల్మాన్‌ను చంపుతామని అంటాడు. పంజాబ్ ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలను పట్టపగలు అతని గ్యాంగ్ హత్య చేస్తుంది.తప్పుడు ఆరోపణలతో ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధం అంటగట్టి అన్యాయంగా అరెస్ట్ చేసినపుడు,కనీసం క్రాస్, ఫ్యాక్ట్ చెక్ చేయకుండా కరుడుగట్టిన మావోయిస్టు అరెస్ట్ అని ప్రచారం చేసిన ప్రభుత్వ ఒడిలో మీడియా ప్రచారం చేసిన విధంగా, సిద్ధిఖీని చంపించిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ 700 మంది ఉన్నారని, అతని నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అంటూ, రకరకాల మొత్తం ముంబై, ఒక సామాజిక వర్గం భయపడే విధంగా మీడియా ప్రచారం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. 

ప్రొఫెసర్ సాయిబాబా పదేళ్లు జైల్లో ఉండి తన శరీరంలోని 90 శాతం అవయవాలన్ని పని చేయకుండా అయిపోయి, జైలు నుంచి విడుదలయి బయటకు వచ్చిన 230 రోజులకే కన్ను మూసారు. ఆయన కోల్పోయిన ఆ పదేళ్లు, సమాజానికి ఎంతో అవసరమైన ఆ ప్రాణంను తెచ్చి ఇవ్వలేక పోయినా ఆ జరిగిన నష్టం గురించి అడుగలేదు. జైలులో బతికి ఉన్నప్పుడు ఆ వెతల నుంచి రక్షించే గట్టి ప్రయత్నంను ఈ మేధావులు  చేయలేదు. ఈ నష్టం గురించి,ఇదే ఫేక్ కేసులో కురు వృద్ధుడు ప్రీస్ట్ స్టాన్ స్వామి జైల్లోనే అనారోగ్యంతో మరణించినపుడు ఈ 'గోది ' మీడియా ప్రశ్నించలేదు. 

 ఎందుకు?' ఆ లౌటాదే మేరే బీతే హుయే దిన్ ' అని వారు ప్రశ్నిస్తున్నారు, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు సమాజ సోయి లేని పిడికెడు పదవులకు అమ్ముడు పోయిన ముఖ్యంగా కుహనా మేధావులను, మీడియాను వారి ఆత్మలు ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కాలర్ పట్టి అడుగుతున్నారు! మాట్లాడండి! దేశంలోని ప్రస్తుత అల్లకల్లోల పరిస్థితులకు, కారకులు ఎవరు? సోయిలేని మనం కాదా? కులం, మతం, మందిర్, మస్జీద్, చర్చ్ అంటూ రాజకీయాలు చేస్తూ, కేవలం తమ అధికారం కోసం పబ్బం గడుపుకునే పాలకులను, పార్టీలను ఇంకెంత కాలం భరిస్తాము.

 మన యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే వారి చేతికి కత్తులు, కటార్లు,రివాల్వర్,మూతికి, ముక్కుకు డ్రగ్స్ ఇచ్చే మాఫియాను ఓడించాలి. అంటే ముందు అన్నింటికీ మూలం అయిన మతోన్మాదాన్ని రూపుమాపాలి. మతం పేరిట దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారు. ముందు ఆ రాజకీయలను రూపుమాపాలి. అందుకోసం పోరాడి, పోరాడి ఊపిరి కోల్పోయిన వారెందరో బాలగోపాల్, సాయిబాబా లాంటి వారి స్ఫూర్తి తో పోరాడాలి. ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం. కుల, మతాలకు అతీతమైన సమాజం, కోసం కృషి చేద్దాం! బుద్ది జీవులారా కదలండి! ఈ రోజు కాకుంటే, మరో రోజు సాధ్యం కాదు! నిజంకు సహకరిద్దాం! నిజం వెంట కలిసి ఉందాం!. 

ఎండి. మునీర్,

సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు

9951865223

#telugu-news #national-news #professor-sai-baba #baba siddique
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe