జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు మరణించారు. గత రెండు దశాబ్దాలలో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. అయితే ఈ ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్ కు చెందిన మహమ్మద్ నౌషద్ అనే యువకుడు తన సోషల్ మీడియాలో 'థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్ -ఇ-తోయిబా' అని పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించి ఝార్ఖండ్ పోలీసులను ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతడి ఉద్దేశమేంటి.. అతనికి ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు వెల్లడించారు. దీనిపై నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఓ వైపు 27 మంది టూరిస్టులు చనిపోతే నీకు సిగ్గుందరా ఇలాంటి పోస్టులు పెట్టడానికి అంటూ మండిపడుతున్నారు.
నౌషాద్ సోషల్ మీడియా పోస్ట్ గురించి మాకు ఫిర్యాదు అందింది. దీని తర్వాత, మేము ఆ యువకుడిని విచారించాము. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసాము. అతని అన్ని సోషల్ మీడియా ఖాతాలను మేము తనిఖీ చేస్తున్నాము. నౌషాద్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా సేకరించే ప్రక్రియలో ఉన్నాము అని నగర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ రంజన్ తెలిపారు.
ఉగ్రవాద దాడి దర్యాప్తు
పహల్గాం ఉగ్రవాద దాడి దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బాధిత కుటుంబాలను కలిశారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. ఉగ్రవాద దాడి అనంతరం బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.