Brain Eating Amoeba: బ్రెయిన్ ఈటింగ్ అమీబా విజృంభణ.. 80 కేసులు, 21 మరణాలు

మెదడు తినే అమీబాగా పిలవబడే ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మంగళవారం ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 80 కేసులు నమోదైయ్యాయని, 21 మరణాలు సంభవించాయని తెలిపారు.

New Update
brain eating

కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. మెదడు తినే అమీబాగా పిలవబడే ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మంగళవారం ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 80 కేసులు నమోదైయ్యాయని, 21 మరణాలు సంభవించాయని తెలిపారు. 

ఈ వ్యాధి పెరుగుదలకు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, 2023 నుండి ప్రతి ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) కేసును నిశితంగా పరిశీలించాలని, దాని కారణాన్ని కనుగొనాలని ప్రభుత్వం ఆసుపత్రులకు సూచించడంతో కేసులు బయటపడుతున్నాయని మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను అభివృద్ధి చేశామని, పీసీఆర్ పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నామని చెప్పారు.

"మా ప్రభుత్వం 2024లోనే సాంకేతిక మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యాధిని గుర్తించడం, కారణాన్ని కనుగొనడం, త్వరగా చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు మా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాం," అని వీణా జార్జ్ మీడియాకు తెలిపారు. ఈ అరుదైన, ప్రాణాంతక వ్యాధి మంచినీటిలో, ముఖ్యంగా నిల్వ ఉన్న నీటిలో నివసించే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెదడుకు చేరుకుని మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు, కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా సంక్రమించదు.

ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, నీటి వనరులను క్లోరినేషన్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. మురికి నీరు, నిల్వ ఉన్న నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం వంటివి మానుకోవాలని, స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచించారు. ఈ పరిస్థితిపై జాతీయ ఆరోగ్య సంస్థలతో కేరళ ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది.

Advertisment
తాజా కథనాలు