VIRAL VIDEO: విచిత్రం.. చేతిపంపుల నుండి చేపలు.. ఖంగుతిన్న గ్రామస్తులు (వీడియో)

కుండీలో నీళ్ల కోసం చేతి పంపు కొట్టగా.. నీటితో పాటు కొన్ని చేపలు ఉబికి వచ్చాయి. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. భూమి లోపలి నుండి చేపలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

New Update
fish came out of hand pumps

fish came out of hand pumps


ప్రకృతి విచిత్రాలు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సాధారణంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీటితో పాటు చెరువులు, నదుల నుండి చేపలు కొట్టుకురావడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లా దుల్లహ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇందుకు భిన్నమైన వింత సంఘటన జరిగింది. భారీ వర్షాల తర్వాత ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోని చేతి పంపులు (హ్యాండ్ పంపులు), బోరు బావుల నుండి నీటితో పాటు చిన్న చేపలు కూడా బయటకు వస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

భూమిలోపలి నుంచి వచ్చే నీటిలో చేపలు బయటికి రావడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఈ వింత దృగ్విషయం జరుగుతోందని స్థానికులు తెలిపారు. చాలా ఇళ్లలో బోరుబావులు, చేతి పంపులు కొట్టినప్పుడు నీటితో పాటు చిన్న చిన్న చేపలు కూడా వచ్చి పడుతున్నాయని చెబుతున్నారు. ప్రమీలా దేవి అనే మహిళ స్నానం చేస్తుండగా పంపు నుండి తన బకెట్‌లో మూడు చిన్న చేపలు పడ్డాయని ఓ మహిళ చెప్పింది. 

 అలాగే చంపా దేవి అనే మరో మహిళ పంపు కొడుతుండగా, ఆమె చేతిపై ఒక చేప పడిందని, దాన్ని చూసి తాను మొదట షాక్ అయ్యానని చెప్పింది. చేతి పంపుల నుండి ఉబికి వస్తున్న ఈ చేపలను చూసిన గ్రామస్తులు, దేవుడి మహిమగా భావించి కొందరు వాటిని తీసుకెళ్లి వండుకుని పండుగ చేసుకున్నారు. ఎంచక్కా ఇంట్లో కూర్చునే చేపలు లభించడంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు.

ఇది ఎలా జరిగింది?

భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో వాగులు, చెరువులు నిండిపోయాయి. ఈ సమయంలో భూమి పొరల్లోని నీటి మట్టం పెరిగి, ఉపరితల జలాలు భూగర్భ జలాలతో కలసిపోయాయి. చేపలు నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి, ఆ నీటిని తోడే చేతి పంపులు, బోరుబావుల పైపుల ద్వారా బయటికి వచ్చి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 

ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు. హ్యాండ్ పంపుల ద్వారా వస్తున్న చేపలను సేకరించుకుని, గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ నీటిని తాగడానికి పెంపుడు జంతువులు కూడా నిరాకరిస్తుండటంతో వంట, తాగునీటి కోసం గ్రామస్తులు RO వాటర్‌ను ఆర్డర్ చేయాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు