/rtv/media/media_files/2025/04/23/wrjF40zUTpb1pic9jDmN.jpg)
The Resistance Front
పహల్గాంలోని బైసరన్లో జరిగిన 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ భీకర దాడిలో 28 పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ గురించి చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే ఈ టీఆర్ఫ్. ముందుగా ఇది ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలు చేసేది.
ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి కొన్ని ఉగ్ర సంస్థల నుంచి సభ్యులను తీసుకొని ఓ గ్రూప్గా ఏర్పాటయ్యింది. అంతేకాదు ఈ గ్రూప్ వెనుక పాకిస్థాన్ కూడా ఉంది. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐనే ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటుచేసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఈ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ వచ్చిందని అంటున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల వల్ల 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్ను ఆర్థిక చర్యల టాస్క్ఫోర్స్ (FATF) చేర్చింది. అందుకే పాకిస్థాన్లో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ TRFను ఏర్పాటు చేయించిందనే ప్రచారం నడుస్తోంది.
Also Read: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
టీఆర్ఎఫ్ 2019లో ఏర్పాటయ్యింది. అప్పటినుంచి దాడులు చేస్తూనే ఉంది. ముఖ్యంగా కశ్మీర్లో తమ ఉనికిని చాటుకోవాలని యత్నిస్తోంది. దీంతో భారత్ కూడా టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థల లిస్ట్లో చేర్చింది. ఇక ఈ టీఆర్ఎఫ్ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. ఇతను ఒక కశ్మీరీ మిలిటెంటు. శ్రీనగర్లోని ప్రముఖ జర్నలిస్టు అయిన షుజాత్ బుఖారీ, అతని భద్రా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్లో హతమార్చేందుకు సజ్జాద్ కట్రు పన్నారు. దీంతో ఉపా చట్టం కింద సజ్జాద్ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు గతంలో అతడు లష్యరే తోయిబో కమాండర్గా కూడా పనిచేశారు. టీఆర్ఎఫ్లో కీలకంగా సాజిద్ జాట్, సలీం రెహ్మానీ ఉన్నారు. వీళ్లు కూడా గతంలో లష్కరే తోయిబాలో పనిచేసిన వాళ్లే.
టీఆర్ఎఫ్ ఉగ్రదాడులు
టీఆర్ఎఫ్ అన్ని మతాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ఉగ్ర సంస్థ చేసిన దాడుల్లో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. ముందుగా 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబటి కుప్వారోని కరన్ సెక్టార్లో నాలుగు రోజుల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అప్పుడు టీఆర్ఎఫ్ పేరు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.
2020 అక్టోబర్ 30న దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. ఆ తర్వాత 2020 నవంబర్ 26న శ్రీనగర్కు సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్పై దాడి చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను చంపేశారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ను హతమార్చారు. 2024 అక్టోబర్ 20న గండేర్బల్లోని సోన్మార్గ్లో ఓ వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. తాజాగా 2025 ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్లో 28 పర్యాటకులను కాల్చి చంపేశారు. మరోవైపు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డవారిని చట్టం ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
terrorist | jammu-kashmir | national-news